కేటీఆర్కు దమ్ముంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలి
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ విధానం : స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేటీఆర్ నాయకత్వం నచ్చకనే హరీశ్రావు దూరంగా ఉంటున్నారని అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. కేసీఆర్ ఉన్నాడనే హరీశ్ రావు పార్టీలో కొనసాగుతున్నారని, లేదంటే తనదారి చూసుకుంటాడని జోస్యం చెప్పారు. కేటీఆర్పై 10 కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లే అవకాశాలు ఎప్పుడైనా రావచ్చొని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని విచ్చలవిడి రాజకీయం, స్కాములు చేసి కేటీఆర్ అడ్డగోలుగా దోచుకున్నాడని ఆరోపించారు. తన అన్నపై నమ్మకం లేకనే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారని తెలిపారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ సభ్యత మరిచి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆరే లేకుంటే కేటీఆర్ ఎక్కడ ఉండే వాడో ఆయన ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్లో 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని, ఇద్దరికి మంత్రి పద వులు ఇచ్చినప్పుడు విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పనికిరానోళ్లను వెంటేసుకొని కేటీఆర్ అహంకారంతో మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ విధానం, సంకల్పమని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేకుండా కేసులకు భయపడుతున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, నాయకులు నాగరబోయిన యాదగిరి, చింత ఎల్లయ్య, కత్తుల కట్టయ్య, కొలిపాక సతీష్, పాశం సురేష్, తెల్లాకుల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ లేని నాడు..బీఆర్ఎస్ ముక్కలు చెక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



