భార్యా భర్తల బంధంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరి అభిప్రాయానికి ఒకరు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా అవసరం. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం సంతోషంగా, సజావుగా సాగుతుంది. అలాంటి తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలు సమాజం ముందు మంచి పౌరులుగా ఉండగలుగుతారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటుంది. అందుకే భార్యాభర్తల కంటే తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఓ కథనమే ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో ఈ వారం…
స్వాతికి సుమారు 42 ఏండ్లు ఉంటాయి. ఓ ప్రైవేటు సంస్థలో హెచ్.ఆర్గా పని చేస్తోంది. భర్త గౌతమ్ కూడా ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. స్వాతికి గౌతమ్ కంటే జీతం ఎక్కువ. కానీ అందులో నుండి ఆమె ప్రతి నెల రెండు వేలు మాత్రమే తీసుకుంటుంది. మిగిలింది మొత్తం గౌతమ్ తీసుకుంటాడు. ఇంట్లోకి కావల్సిన సరుకులు, పిల్లల ఫీజులు, ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినా అన్నీ అతనే చూసుకుంటాడు. స్వాతి ఏటీఎం కార్డు అతని దగ్గరే ఉంటుంది. ఏటీఎం గురించి అడిగితే ‘ఇంట్లోకి కావల్సినవన్నీ తెస్తున్నాను, నీకు నెలకు రెండు వేలు ఇస్తున్నాను. ఇంక నీకు వేరే ఖర్చులు ఏముంటాయి’ అంటాడు.
పైగా స్వాతి మాటలకు అస్సలు విలువ ఇవ్వడు. ఏ విషయంలోనూ ఆమె అభిప్రాయం తీసుకోడు. ఏమైనా అడిగితే ‘నీ ముఖం నీకేం తెలియదు’ అంటాడు. ఆర్థిక విషయాల్లోనే కాదు ఇంట్లో ఏం జరిగినా, పండుగలైనా, ఫంక్షన్లు అయినా కనీసం నచ్చిన బట్టలు కూడా ఆమెను తీసుకోనివ్వడు. ‘బట్టల గురించి నీకేం తెలుస్తుంది. నీకు ఏది బాగుంటుందో నాకు తెలుసు కదా! నేను తీసుకొస్తాను’ అంటాడు. అవి స్వాతికి నచ్చకపోయినా వేసుకోవాల్సిందే. ఈ మధ్య కాలంలో స్వాతి తమ్ముడి పెండ్లి జరిగింది. ఆడపడుచు కట్నం కింద ఆమెకు కొంత డబ్బు ఇచ్చారు. ‘తమ్ముడి పెండ్లి కాబట్టి ఈ డబ్బులతో నగలు, బట్టలు తీసుకో. చెల్లికీ నీకూ ఇస్తున్నాము. ఇద్దరూ ఒకే లాంటివి తీసుకోండి. పెండ్లిలో చూడటానికి కూడా బాగుంటుంది’ అన్నారు తల్లిదండ్రులు.
సరే అని స్వాతి వాళ్ల చెల్లి ఒకే రకమైన పట్టు చీరలు తీసుకున్నారు. అది గౌతమ్కు నచ్చలేదు. అంతే.. వాళ్ల అమ్మవాళ్ల ఇంట్లోనే ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మీ అమ్మానాన్న డబ్బులు ఇవ్వగానే నాకు ఇవ్వాలని తెలియదా? ఈ పట్టుచీర లేకపోతే మీ తమ్ముడి పెండ్లికి రానివ్వమన్నారా మీ అమ్మానాన్న’ అంటూ ఆమెపై చేయి కూడా చేసుకోబోయాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. కనీసం నచ్చిన చీర కొనుక్కునే స్థితిలో కూడా స్వాతి లేదే అని బాధపడ్డారు.
పిల్లలు కూడా స్వాతి ఏమైనా చెబితే ‘అమ్మా.. నీకేం తెలియదు. మా చదువు మా ఇష్టం, మాకు నచ్చింది మేము చదువుకుంటాము. ఏది చదివితే మా భవిష్యత్ బాగుంటుందో మాకు తెలుసు. నీవు చెబితే తెలుసుకునే పరిస్థితిలో మేము లేము’ అని లెక్కలేకుండా మాట్లాడతారు. ఆమెకు ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం లేకుండా పోయింది. కానీ ఆఫీసులో మాత్రం ఆమెను అందరూ గౌరవిస్తారు. ‘ఆమె తెలివి తేటలు, నేర్పుతోనే మా కంపెనీ ఇంత అభివృద్ధి చెందింది’ అనే వాళ్ల మేనేజర్. తోటి ఉద్యోగులు తనపై చూపిస్తున్న గౌరవానికి స్వాతి ఎంతో సంతోషించేది. ‘ఆఫీసులో నేను వర్క్ బాగా చేస్తున్నాను. కానీ ఇంట్లో చేయలేకపోతున్నానా’ అనే అనుమానం ఆమెలో మొదలయింది. అదే విషయం తన స్నేహితుల దగ్గర పంచుకుంది. ఆమె మాటలు విన్న లక్ష్మి ‘సమస్య నీ దగ్గర లేదు. నీ భర్తలో వుంది. దాని గురించి నీవు అతనితో మాట్లాడు’ అన్నది. ఈ విషయం గురించి గౌతమ్ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అతను లెక్క చేయలేదు. ‘నీ మాటలు వినడానికి నాకు టైం లేదు. ఎప్పుడూ నాతో మాట్లాడు అని గొడవ చేస్తావు. అసలు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు’ అన్నాడు. పిల్లలు కూడా ‘నాన్నకు నీతో మాట్లాడడం ఇష్టం లేకపోతే వదిలేయవచ్చు కదా!’ అన్నారు. దాంతో స్వాతి చాలా బాధ పడింది.
‘అసలు ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారు. పిల్లలు కూడా కనీసం నా బాధ అర్థం చేసుకోవడం లేదు. నాకు గౌరవం ఇవ్వడం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు బతుకున్నానో అర్థం కావడం లేదు. నేను చనిపోయినా ఏ ఒక్కరికీ ఎలాంటి బాధా ఉండదు’ అనుకొని ఒంటరిగా ఉంటూ, తనలో తానే కుమిలిపోతూ ఉండేది. ఇది గమనించిన స్నేహితురాలు లక్ష్మి ఆమెను ఐద్వా లీగల్ సెల్కు తీసుకొచ్చింది.
మేము స్వాతితో మాట్లాడి ఆమె భర్త, పిల్లలను కూడా పిలిపించాము. గౌతమ్ మాట్లాడుతూ ‘స్వాతి పిచ్చిది, అలాగే మాట్లాడుతుంది. ఆమెకు సమాజం గురించి ఏమీ తెలియదు. అయినా ఆమె ఇల్లు చూసుకుంటూ ఉద్యోగం చేస్తే చాలు. అలా కాకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, మీరు అది చేయాలి, ఇది చేయాలి అంటూ సలహాలు ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. పైగా స్వాతి నా కంటే ఎక్కువ సంపాదిస్తుంది. నేను ఆమెను ఇలా డామినెట్ చేయకపోతే ఆమే నన్ను డామినెట్ చేస్తుంది. అందుకే ఏ విషయంలోనూ ఆమె సలహా తీసుకోను. భవిష్యత్తులో కూడా నేను ఆమె దగ్గర నుండి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోను. భార్య పని ఏమిటి, భర్త ఇంటికి వచ్చే వరకు ఇంట్లో పని చేసి అందంగా రెడి అయ్యి ఉండాలి. అంతేకాని ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి భర్తతో సమానంగా ఉంటాను అనడం సరైనది కాదు. ఈ మధ్య కాలంలో ఆ లక్ష్మితో స్నేహం మొదలుపెట్టిన తర్వాత ఎదురు మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె వల్లనే ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
అతని మాటలు వింటే మాకు ఆశ్చర్యం కలిగింది. ఈ రోజుల్లో కూడా ఇంత దుర్మార్గంగా ఆలోచించే వారు ఉన్నారా అనిపించింది. ‘భార్యా భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి. ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండాలి. ఒకరి సలహాలు ఒకరు తీసుకోవాలి’ అంటే ‘స్వాతిని నేను గౌరవించడం ఏంటీ. నేను చెప్పినట్టు ఆమె వినాలి. లేకపోతే ఆమె నాకు అవసరం లేదు. ఏది ఏమైనా ఆమె నా మాటే వినాలి’ అని కచ్చితంగా చెప్పాడు. ఎంత సర్ది చెప్పినా వినడానికి సిద్ధపడలేదు.
దాంతో స్వాతి ‘అయితే నేను నాకు నచ్చినట్టు బతకగలను. నేనూ మనిషినే కదా! నాకూ కొన్ని కోరికలు, ఆలోచనలు ఉంటాయి. వాటికి విలువలేనప్పుడు నేనెందుకు వుండాలి. ఇలాంటి జీవితం నాకు అవసరం లేదు’ అన్నది. కూతురు భావన కూడా తల్లికే సపోర్ట్ చేసింది. కానీ కొడుకు మాత్రం తండ్రితో వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కొడుకు కూడా తల్లిని, చెల్లిని వదిలి వుండలేక వీళ్ల దగ్గరకే వచ్చేశాడు. ప్రస్తుతం గౌతమ్ ఒంటరిగా ఉన్నాడు. స్వాతి తన ఇద్దరు పిల్లలతో వేరే ఇల్లు తీసుకొని ఉంటుంది. ‘అమ్మా, ఇన్ని రోజులు మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు’ అన్నారు. ప్రస్తుతం ముగ్గురూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు.
– వై వరలక్ష్మి, 9948794051
ఆమెకు విలువ లేదా..?
- Advertisement -
- Advertisement -