– సీఎం రేవంత్ రెడ్డి భాష అభ్యంతరకరం
– ప్రజలకు క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అహింసా పద్ధతిలో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరో గాంధీ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు. ఫామ్హౌజ్లో మానవ మృగాలున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీతో ప్రజలను హింసించి, ఢిల్లీలో టర్క్మెన్ గేట్ దగ్గర వేలాది ఇండ్లు కూల్చి, 1969 ఉద్యమంలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీదే మృగత్వం అని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తూ, కట్టిన భవనాలకు రిబ్బన్ కట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్పొరేషన్ మాజీ చైర్మెన్ జి.దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన ఉద్యమకారున్ని ఉద్యమంలో ఏనాడు లేని రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ హెచ్సీయూ భూములు అమ్ముకునే వాళ్ళు, గిరిజన రైతులపై లాఠీచార్జ్ చేసిన వాళ్ళు మానవ మృగాలు అని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఓయూలో అపరిచితునిలా మాట్లాడారని విమర్శించారు. కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర చారి మాట్లాడుతూ సీఎం మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయన్ను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ మరో గాంధీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES