భవిష్యత్తు అంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదే
గజ్వేల్ నేతలతో త్వరలో సీఎం సమావేశం : సర్పంచుల సన్మాన సభలో మంత్రి వివేక్
నవతెలంగాణ-గజ్వేల్
కేసీఆర్ (బీఆర్ఎస్) పార్టీ ఫామ్హౌస్కు పరిమితమైపోయిందని.. ఆ పార్టీ కోసం మాట్లాడే అవసరం లేదని భవిష్యత్తు అంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్లుగా గెలుపొందిన వారికి శుక్రవారం సన్మానం నిర్వహించారు. దీనికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మూడుసార్లు ఓట్లు వేసిన గజ్వేల్ ప్రజలకే కనిపించని కెేసీఆర్.. రెండేండ్ల తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తోలు తీస్తానని అనడం సిగ్గుచేటన్నారు. గజ్వేల్ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించామన్నారు. 2029లో గజ్వేల్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీలో గెలుపొందిన సర్పంచులకు నిధుల కోరతలేదని, సీఎం రేవంత్తో మాట్లాడి నియోజకవర్గానికి నిధులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.
నియోజకవర్గ సర్పంచులతో త్వరలో ముఖ్యమంత్రి సమావేశం ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని అందులో ఇందిరమ్మ ఇల్లు, సిమెంటు రోడ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరు గ్యారెంటీల పథకాలను, ఉచిత బస్సు వంటి వాటిని అందులో పొందుపరచాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక హుస్నాబాద్, నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి, నాయకులు రాజు, రంగారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, నక్క రాములు గౌడ్, గాడి పల్లి శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


