నిజాలు తెలుసుకొని మాట్లాడు
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాల్గం ప్రవీణ్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి : వ్యక్తిగత కారణాలతో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ కరికవేని కుంటయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించడానికి వచ్చిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరకవేణి కుంటయ్య మృతి పట్ల దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కుంటయ్య చావుతో మండలంలో శవ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అనేది ఎవరికీ చుట్టం కాదు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయి.. కుంటయ్య మృతిలో కారణాలు వెతుక్కుంటూ కాంగ్రెస్ నాయకుల ఆకృత్యాల వల్లే మృతి చెందాడని అనడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గతంలో వీరందరూ కలిసి వ్యాపారాలు చేసుకునేవారని దీనిలో భాగంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లిందని తెలిపారు. ఆ సందర్భంలో 2023 సంవత్సరంలో మల్యాల నాగరాజు వద్ద కొనుగోలు చేయడం జరిగిందని, ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడే జరిగిందని, కుంటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నాగరాజును పోలీసులు జైలుకు పంపడం జరిగిందని వెల్లడించారు. ఇదే కుంటయ్య మరో వ్యక్తికి భూమిని అమ్మి సొమ్ము చేసుకొని అట్టి భూమిని చూపించకపోవడంతో అతనిపై భూమి కొన్న వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. వీటిపై కొంతమంది బిఆర్ఎస్ నాయకులు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కేటీఆర్ మాట్లాడిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తే చూస్తూ సహించమని హెచ్చరించారు.