Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅప్రెంటిస్‌ పేరుతో శ్రమదోపిడీ

అప్రెంటిస్‌ పేరుతో శ్రమదోపిడీ

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న నాన్‌-పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, క్యాజువల్‌, పిక్స్‌డ్‌ టర్మ్‌, నీమ్‌, అప్రెంటిస్‌, నాప్స్‌, నాట్స్‌ పేర్లతో యాజమాన్యాలు చేస్తున్న శ్రమ దోపిడీని అరికట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నాన్‌ రెగ్యులర్‌ వర్కర్ల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ, నాన్‌-పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, క్యాజువల్‌, అప్రెంటిస్‌, నాప్స్‌, నాట్స్‌ వంటి పేర్లతో కార్మికులను పెద్దఎత్తున నియమించుకుంటున్నారని తెలిపారు. ఈ విధానం ద్వారా యజమానులు శాశ్వత ఉద్యోగాలను తగ్గించుకుని తక్కువ వేతనాలతో, ఎలాంటి హక్కులు లేకుండా కార్మికులను దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేతనం పోందే కార్మికుల స్థానంలో స్టయిఫండ్‌తో పనిచేసే సిబ్బందిని తయారు చెస్తున్నదని చెప్పారు. ఇది కార్మిక చట్టాల ఉల్లంఘన మాత్రమే కాకుండా, కార్మిక వర్గంపై తీవ్రమైన దాడిగా చూడాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా…ఒకే పని చేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ కార్మికులకు తక్కువ వేతనాలివ్వడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఎప్పుడైనా తొలగించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి రక్షణ లేకపోవడం. సామాజిక భద్రత లేకపోవడం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, గ్రాడ్యుటీ వంటి చట్టబద్ధ హక్కులు నిరాకరించడం. పని భద్రత లేకుండా పోతోందని తెలిపారు. నాప్స్‌. నాట్స్‌ పేరుతో శాశ్వత పనులను అప్రెంటిస్‌లతో చేయించడం, ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు అణచేయడం వంటి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అప్రెంటిస్‌లను శిక్షణ తర్వాత శాశ్వత ఉద్యోగాల్లో తీసుకోవాలని సదస్సులో తీర్మానించారు. ”కాంట్రాక్ట్‌ లేబర్‌ వ్యవస్థను నియంత్రించాలి, ట్రేడ్‌ యూనియన్‌ హక్కులను రక్షించాలి. పని గంటలు చట్టబద్ధంగా ఉండేలా చూడాలి. సేఫ్టీ ప్రమాణాలు అమలు చేయాలి. డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని రకాల కార్మికులు ఐక్యంగా పోరాడాలి” అని పిలుపునిచ్చారు.
సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు పుప్పాల శ్రీకాంత్‌, పద్మశ్రీ, మెడ్చేల్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్‌, వివిధ యూనియన్ల నాయకులు మణికంఠ, మహేశ్వర్‌, వీరరావు, వెంకట్రావు, సిందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -