తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ‘సుప్రీం’కు ప్రభుత్వ అభ్యర్థన
ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణ మార్చి 10 కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనలను సర్వోన్నత్య న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐబీకి నేతత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే ప్రభాకర్రావు అమెరికా వెళ్లిపోయారు.
ముందస్తు బెయిల్ ఇస్తేనే భారతదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ సిద్దార్థ్ లూత్రా, ప్రభాకర్ రావు తరపున అడ్వొకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.
ముడిపడి ఉన్న న్యాయపర అంశాలు
రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర వాదనలు వినిపిస్తూ… కొన్ని న్యాయపరమైన సాంకేతిక అంశాలపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. అందువల్ల ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవద్దని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనపై జస్టిస్ నాగరత్న అసహనం వ్యక్తం చేస్తూ… కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు సహకరించారు కదా?. మీకు వేరే ఉద్దేశాలుంటే మేము ప్రోత్సహించలేము. ప్రభాకర్ రావును జైల్లో ఉంచాలనేదే మీ ఆలోచన. ఆయనను మీరు విచారణకు అడిగితే విచారణకు సహకరించమని చెప్పాము.
అవసరం అనుకుంటే మళ్లీ విచారణకి పిలిచి ప్రశ్నించవచ్చు. సహకరించమని చెప్తాము. ఇంకా ఎంతకాలం ఈ పిటిషన్పై విచారణ జరపాలి’ అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ముందస్తు బెయిల్ విషయంలో మూడు న్యాయపర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని లూత్రా పలుమార్లు కోర్టుకు నివేదించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం న్యాయపరమైన సాంకేతిక అంశాలపై మార్చి 10 న విచారణ జరుపుతామని విచారణను వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
ప్రభాకర్రావు ముందస్తు బెయిల్పై న్యాయపర అంశాలు ముడిపడి ఉన్నాయి
- Advertisement -
- Advertisement -



