– ఎంపీని కలిసిన న్యాయవాదులు
– పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల జిల్లా కోర్టు నిర్మాణ స్థలం విషయంలో న్యాయవాదుల సంఘం మంగళవారం పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలిశారు. రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏ కారణాలతో రిట్ పిటిషన్ ఉపసంహరణ నిర్ణయం జరిగిందో న్యాయవాదుల సంఘం డీకే అరుణకు వివరించారు. న్యాయస్థానంలో జరిగిన వాస్తవ విషయాలు పక్కన పెట్టి కొందరు అదే పనిగా కోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. మెజార్టీ న్యాయవాదుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మరో రూపంలో ఉన్నత న్యాయస్థానం ముందుకు వెళ్తామని తెలిపారు.
న్యాయవాదుల సంఘం చట్టపరంగా చేస్తున్న ప్రయత్నాలకు సమాంతరంగా ప్రజలు – ప్రజా సంఘాలు – ప్రతిపక్షాలు – ప్రజాప్రతినిధులు – ప్రభుత్వం మధ్య ఈ విషయం తేలాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా జరిగిన నిర్ణయానికి రాజకీయ పరిష్కారం జరగాలని, అందుకోసం కృషి జరగాలని డీకే అరుణను కోరారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ .. న్యాయవాదుల సంఘం వ్యక్తపరిచిన అభిప్రాయంపై డీకే అరుణ ప్రతిస్పందిస్తూ, అధికారులు, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో వేచి చూడడం జరిగిందన్నారు. తాను ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడడం జరిగిందన్నారు. దీపావళి పండుగ అనంతరం ముఖ్యమంత్రితో చర్చించడానికి ప్రయత్నం చేద్దామన్నారు. అప్పటికి స్థల మార్పిడి విషయంలో సానుకూలమైన నిర్ణయం జరగకపోతే భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు కావలి నరసింహులు, మాజీ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఆనంద్ గౌడ్ తో పాటు పలువురు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.