నలుగురు అరెస్టు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
వివరాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్
నవతెలంగాణ – మియాపూర్
నగరంలోని గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో పరిధిలో రేవ్పార్టీ నిర్వహిస్తున్నరనే పక్కా సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 20 గ్రాముల కొకైన్, 8 గ్రాములు ఎండీఎంఏ, ఇతర మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన తేజ, విక్రమ్, నీలిమ.. కామన్ ఫ్రెండ్స్. వారందరికీ కొకైన్ తాగే అలవాటు ఉంది. వీరు బెంగళూరుకు ఒకసారి వెళ్ళినప్పుడు, తేజ బెంగళూరులోని సోనునగర్లోని రాహుల్ను కలిశాడు. అతను కొకైన్ సరఫరా చేసేవాడు. అప్పటి నుంచి తేజ.. రాహుల్ నుంచి కొకైన్ తీసుకోవడం ప్రారంభించాడు. విక్రమ్, నీలిమ కలిసి రాజమండ్రిలో తాగేవారు. వీరు జాబ్ కోసం హైదరాబాద్కు వచ్చారు. వీరంతా కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. అక్కడ క్రమం తప్పకుండా కలుసుకుని కొకైన్ తాగేవారు. తేజ ప్రతి లావాదేవీని రాహుల్ ఇచ్చిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బును పంపేవాడు. ఈ క్రమంలో వీరుండే అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్తోపాటు ఎండీఏంఏను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో చందన్, పురుషోత్తంరెడ్డి, భార్గవ్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.