Monday, November 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనవీన్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి

నవీన్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి

- Advertisement -

జూబ్లీహిల్స్‌ ఓటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌/ బాలానగర్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం యూసఫ్‌గూడ పార్టీ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ముదిరాజ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ”నవీన్‌ యాదవ్‌ సేవకుడు. పదవి లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. బలహీన వర్గాల వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.6 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. జూబ్లీహిల్స్‌ అన్ని రంగాల్లో మరింతంగా అభివృద్ధి చెందాలంటే నవీన్‌ను గెలిపించండి” అని భట్టి ఓటర్లను కోరారు.

పదేండ్లు మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ 30 వేల నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో నవీన్‌ యాదవ్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఫేక్‌ సర్వేలు చేసుకుని గెలుస్తామనే భ్రమలో బీఆర్‌ఎస్‌ ఉందని ఎద్దేవా చేశారు. పదేండ్ల ఆ పార్టీ పాలన చూసిన జనాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా తీరు మార లేదని విమర్శించారు. కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి ఎవరు ఓటు వేసిన నోటాకు ఓటు వేసినట్టేనని అభిప్రాయపడ్డారు.

అదే విధంగా అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, ఆ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని కల్యాణ్‌ నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వి. నవీన్‌ కుమార్‌ యాదవ్‌ను గెలిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ డా.జీవీ వెన్నెల గద్దర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గల్లీ.. గల్లీ.. తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు, మంత్రి జూపల్లి మాట్లాడారు.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. స్థానికుడైన కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. 22 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -