సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఆశ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్ కి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా 2025 జూలై 9 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పాల్గొంటుందని తెలిపారు. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుంది. కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుంది. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారు. కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుంది అని కార్మిక సంఘాలు భావించాయి. వీటితో పాటు ఆరోగ్య రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ నిర్వీర్యం చేస్తున్నది. ఆశా వర్కర్లకు నేటికీ స్థిర కనీస వేతనం నిర్ణయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నది.
దేశంలోని పరిస్థితినంతటిని సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు 2025 జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపును తెలంగాణ రాష్ట్రంలోను అమలు చేసి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 2025 జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మా సంఘం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) కూడా పాల్గొనాలని నిర్ణయించాము. అందుకని పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్-22, సబ్ సెక్షన్(1)ని అనుసరించి ఈ సమ్మె నోటీస్ జారీ చేస్తున్నాము. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. ఆశా వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలి.
ఆశా వర్కర్లకు స్థిర కనీస వేతనం నెలకు రూ.26,000/-లుగా నిర్ణయించాలి. 45వ, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం ఆశా వర్కర్లకు పెన్షన్ ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలి.ఆశా వర్కర్లను 3వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.ఆశా వర్కర్లను (యన్హెచ్యం) ని శాశ్వత ఆరోగ్య కార్యక్రమం (పథకం)గా నిర్ణయించాలి. దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పని పరిస్థితులు అమలులోకి తేవాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 20 రోజుల క్యాజువల్ సెలవులు వేతనంతో కూడిన మెడికల్ సెలవులను నిర్ణయించాలి.రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ప్రకటించే వరకు పదవీ విరమణ ఉండరాదు.
సీనియారిటీ ప్రాతిపదికన ఆశా వర్కర్లను (ఎయనియం) పోస్టుల్లో పదోన్నతి కల్పించాలిఅన్ని పిహెచ్సిలు/యుపిహెచ్సిలు జిల్లా, రాష్ట్ర ఆసుపత్రులలో ఆశాలకు విశ్రాంతి గదులు ఏర్పాటు చెయ్యాలి.విధుల నిర్వహణ కోసం ఆశా వర్కర్లకు స్కూటర్ ఇవ్వటంతో పాటు దానికయ్యే పెట్రోల్ ఖర్చులను చెల్లించాలి. ఆన్లైన్ పని కోసం మంచి నాణ్యమైన ట్యాబ్లు, డేటా ప్యాక్, నెట్వర్క్ ఇవ్వటంతో పాటు సరైన శిక్షణను అందించాలి.ఆరోగ్యం (ఆసుపత్రులతో సహా) అన్ని ప్రాథమిక సేవలను ప్రైవేటీకరించడానికి ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల (పిఎస్ఐలు) సేవలను ప్రైవేటీకరించరాదు.రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా నాయకులు జి రేణుక, బి స్వప్న, శోభ, సిహెచ్ నర్స, శ్రీలత, లలిత, తదితరులు పాల్గొన్నారు.