కల్లూరి మల్లేశం: సిఐటియు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి : జూలై 09 న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కల్లూరి మల్లేశం కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఎస్ ఈ కృష్ణయ్య సార్ కి మరియు మేఘా కంపెనీ ఏ ఎం కార్యాలయంలో జూలై 09 సమ్మె కు సంబంధించిన సమ్మె నోటీస్ లను యూనియన్ నాయకత్వంతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ జూన్ నెల పూర్తి కావస్తున్న నేటికి మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు రాలేదని వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యాసంవత్సరం ప్రారంభమైనందున పిల్లల చదువులకు , పుస్తకాలకు ఇబ్బందులు ఎదరౌతున్నాయని వెంటనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. జూలై 09 సమ్మె కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశవ్యాపితంగా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు.కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు లేబర్ కోడ్ ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేశారని విమర్శించారు.
మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్ లకు 16 లక్షల 35 వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు.కావున కార్మికులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 09 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను , వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేష్, నాయకులు మహేష్, వంగూరు జంగయ్య, ఎం జంగయ్య, లింగస్వామి, మైసయ్య, కరుణాకర్, పరశురాం పాల్గొన్నారు.