ఖతార్ గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడి ఎఫెక్ట్
భారత్కు ఎనర్జీ షాక్!
దోహా : ఇరాన్ క్షిపణి దాడులతో ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ కేంద్రాల్లో ఒకటైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరా సంక్షోభం మరింత తీవ్రమై, భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద ఎనర్జీ షాక్ తగిలే పరిస్థితి ఏర్పడింది. వివరాళ్లోకెళ్తే… ఇరాన్ ఇటీవల చేసిన దాడుల్లో ఖతార్కు చెందిన ముఖ్య గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడులతో ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతి సామర్థ్యంలో సుమారు 17 శాతం తగ్గుదల ఏర్పడింది.
ఇది ఏడాదికి దాదాపు 20 బిలియన్ డాలర్ల నష్టం కలిగించే అవకాశం ఉందని ఖతార్ ఎనర్జీ మంత్రి చెప్పారు.ఈ దాడుల్లో రెండు ప్రధాన ఎల్ఎన్జీ యూనిట్లు, ఒక గ్యాస్-టు-లిక్విడ్స్ ఫెసిలిటీ దెబ్బతిన్నాయి. వీటిని పునర్నిర్మించడానికి మూడు నుంచి ఐదేండ్లు పట్టొచ్చు. మొత్తం నష్టం సుమారు 26 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. ప్రపంచంలో ఎల్ఎన్జీ సరఫరాలో కీలక పాత్ర పోషించే రాస్ లఫాన్ కేంద్రం సాధారణంగా ప్రపంచ సరఫరాలో దాదాపు 20 శాతం వాటా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కేంద్రం దెబ్బతినడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్పై తీవ్రమైన ప్రభావం చూపుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
భారత్పై ప్రభావం
భారత్ తన ఎల్ఎన్జీ అవసరాల్లో సుమారు 40 శాతాన్ని ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఈ దాడి భారత్కు నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో గ్యాస్ ధరలు, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరగొచ్చనీ, ఎరువుల తయారీపై ప్రభావం పడుతుందనీ, ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఖతార్ ఇప్పటికే ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలకు ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ దేశాలు ప్రత్యామ్నాయ సరఫరాల కోసం ప్రయత్నించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు.



