సెలవులు, 8 గంటల పని అమలు చేయాలి
పీఎఫ్ బకాయిలు కార్మికుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న సుమారు 100 మంది మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ నుంచి శనివారం సీఐటీయూలో చేరారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి కందరపు రాజనర్సు ఆధ్వర్యంలో వారు యూనియన్లోకి వచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సీఐటీయూ కార్మికుల కోసం చేస్తున్న అలుపెరగని పోరాటాల వల్లే తాము ఈ యూనియన్లో చేరామన్నారు. తమ న్యాయమైన హక్కులను పోరాటాల ద్వారా సాధించుకుంటామని తెలిపారు. వాటర్ వర్క్స్ కార్మికులకు నెలకు నాలుగు సెలవులు, ఏడాదిలో 15 క్యాజువల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంపుల వద్ద పనిసేసే కార్మికులకు 8గంటల పని అమలు చేయాలని, లేదా ఓటి చెల్లించాలని కోరారు.
ఏటా రెండు జతల నాణ్యమైన దుస్తులు, సరిపడ సబ్బులు, నూనెలు, రెయిన్ కోట్స్ ఇవ్వాలని, పీఎఫ్ బకాయి డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమచేయాలని అన్నారు. లేకుంటే దీపావళి పండుగ తర్వాత ఈపీఎఫ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్ కార్మికులకు కేటగిరీ వేతనాలు అందరికీ అమలు చేయాలని కోరారు. సీఐటీయూలో చేరిన వారిలో రాజు, కృష్ణ, శంకర్, ఇస్మాయిల్, అబ్బాస్, నాగరాజ్, మహేష్, పిట్ల శ్రీను, ధర్మ, సంజీవ్, భాస్కర్, అజరు, నవీన్, కలీమ్, రాజు, మహమూద్, శ్రీనివాస్, లింగం, రాజయ్య, రాజు, రాములు, అన్వర్, శ్రీకాంత్, ప్రశాంత్, రాజు, రవీందర్, దేవేందర్, బాలరాజ్, ఇబ్రహీం, స్వామి, పాషా, నర్సింలు, సత్యం, బాలయ్య, రాజయ్య, శ్రీను, సిహెచ్ రాజు, రంజిత్ తదితరులు ఉన్నారు.