గ్రేటర్ హైదరాబాద్లో విచ్చలవిడిగా నిర్వహణ…
చదివిన కోర్సు ఒకటి..చేసే ప్రాక్టీస్ మరొకటి!
ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ
మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్లినిక్లకు గ్రేటర్ హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. రోజుకో చోట, గల్లికో క్లినిక్ వెలుస్తుండటం గమనార్హం. ఇక్కడ పని చేసేవారికి చదివిన కోర్సుతో సంబంధం లేకుండా ఉంటోంది. ఒక కోర్సు చదివి.. మరో కోర్సుపై ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. నగరంలో సగానికిపైగా క్లినిక్లలో ఇలాంటి వ్యవహారమే నడుస్తో ంది. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అనే తరహాలో పరిస్థితులు ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. పెద్దగా ఫలితం లేకపోగా.. వరుసగా తెలంగాణ వైద్య మండలి చేస్తున్న తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విచ్చలవిడిగా క్లినిక్లు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో విచ్చలవిడిగా క్లినిక్లు వెలుస్తున్నాయి. చవివిన కోర్సు ఒకటైతే ప్రాక్లీస్ మరో కోర్సుపై చేస్తున్నారు. ఓ డాక్టర్ నగరంలో న్యూరాలజీ క్లీనిక్ పేరిట వైద్యం అందిస్తున్నారు. ఈ డాక్టర్ ఎండీ బయోకెమిస్ట్రీ కోర్సు పూర్తి చేసినట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ న్యూరాలజీ క్లినిక్ను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధిం చిన కోర్సు, కనీసం జనరల్ మెడిసిన్ వంటి పీజీ కోర్సులేవీ వారు చేయలేదు.
యథేచ్ఛగా న్యూరాలజీ పేషెంట్లకు చికిత్స అందించేస్తున్నారు. పైగా వారు పని చేసే ప్రదేశంలో డిస్ ప్లే బోర్డులో పీజీడీజీఎమ్ (జీరియాట్రిక్స్) అని పొందుపర్చడం గమనార్హం. ఈ పీజీ కోర్సుతో సూపర్ స్పెషాలిటీ విభాగంలో న్యూరాలజీకి చికిత్స చేయడం నిబంధనలకు విరుద్ధం. మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం తాము చదివిన కోర్సు, చేసే చికిత్సకు సంబంధించిన స్పష్టమైన బోర్డును వారు పని చేస్తున్న ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఈవేమీ జరగడం లేదు. ఇలాంటి క్లీనిక్స్పై ఇప్పటికే ఆయా జిల్లాల డీఎంఅండ్హెచ్వోలకు ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం.
కోర్సుకు, చికిత్సకు సంబంధం లేదు
మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని కొన్ని ప్రయివేటు క్లీనిక్లలో అర్హత లేని డాక్టర్లు వైద్యం అందిస్తుండగా, మరికొన్ని చోట్ల కోర్సుకు, అందిస్తున్న చికిత్సకు అసలు సంబంధం ఉండటం లేదని తేలింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 550 హాస్పిటల్స్పై ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. అందులో సింహభాగం గ్రేటర్ నుంచే ఉండటం గమనార్హం. ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లీనిక్స్కు అనుమతి కోసం కొందరు ఎంబీబీఎస్ డాక్టర్లు వారి సర్టిఫికెట్లను రెంటుకు ఇస్తున్నారు.
ఇలా ఆర్ఎంపీకి ఎంబీబీఎస్ వైద్యులు సహకరించడం రూల్స్ బ్రేక్ చేయడమే అవుతుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఓ క్లీనిక్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించగా.. అర్హత లేని ఆర్ఎంపీపై ఎన్ఎంసీ యాక్ట్ 34, 54 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, సహకరించిన ఎంబీబీఎస్ డాక్టర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్ని రోజుల నుంచి మెడికల్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహిస్తున్నా.. కొన్ని క్లీనిక్స్కు ఎలాంటి భయం లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే తమ కార్యకలాపాలను కొసాగిస్తున్నాయి.
వెలుగులోకి విస్తుపోయే నిజాలు
గ్రేటర్ హైదరాబాద్లో చాలా మంది ఎంబీబీఎస్ వైద్యులు ఆర్ఎంపీల క్లీనిక్లకు అనుమతుల కోసం వారి సర్టిఫికెట్లను అద్దెకు ఇస్తున్నట్టు మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదులు అందుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఇలాంటి క్లీనిక్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక కోర్సు చేసి మరో విభాగానికి సంబంధించిన వైద్యం అందిస్తుండటంతోపాటు సూపర్ స్పెషాలిటీ చికిత్స ఇవ్వడం గమనార్హం. ఇలాంటిది అత్యంత ప్రమాదకరమనీ, ప్రజలను మోసం చేసేందుకు కొందరు డాక్టర్లు ఇలాంటి ట్రిక్స్ను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని కొందరు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో ఇంత నిర్లక్ష్యంగా వైద్యం అందించడాన్ని సర్కార్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ వైద్యులు కోరుతున్నారు.



