– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– క్రీడాకారులకు అండగా ఉంటా.. రాష్ట్ర స్థాయి టోర్నీలు నిర్వహిద్దాం
– కమ్మర్పల్లిలో ఘనంగా ప్రారంభమైన 69వ ఎస్జీఎఫ్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ పోటీలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
క్రీడలతోనే మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు అలవాటుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని ఇండోర్ మైదానంలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ అండర్-17 (బాలబాలికల) టోర్నమెంట్, ఎంపికల పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల నిర్వహణలో పీఈటీలు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవను, వారి అంకితభావాన్ని ఆయన కొనియాడారు.
క్రీడాకారులకు, అసోసియేషన్ సభ్యులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. క్రీడల నిర్వహణలో ఎవరూ వెనకడుగు వేయవద్దని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కమ్మర్పల్లి లేదా వేల్పూర్ వేదికగా రాష్ట్ర స్థాయి ఈవెంట్ను నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎక్కడ వీలైతే అక్కడ పెద్ద ఎత్తున టోర్నమెంట్లు నిర్వహించాలని సూచించారు.రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో రెండు ఇండోర్ స్టేడియంలు ఉన్నాయని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఈ మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.తన తండ్రి, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గొప్ప క్రీడాకారుడని గుర్తు చేసుకున్నారు.
ఆయన జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడని, సీనియర్ నేషనల్స్ ఆడారని, అలాగే క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ వంటి అన్ని క్రీడలలో రాణించారని తెలిపారు. విద్యాసాగర్ సూచించినట్లుగా, భవిష్యత్తులో సురేందర్ రెడ్డి పేరు మీద రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడానికి అసోసియేషన్, అధికారులు చొరవ తీసుకుంటే దానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
పోటీతత్వమే గెలుపుకు తొలిమెట్టు..
రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే ఒక గొప్ప విజయమని, ప్రతి జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉండగా, కేవలం 16 మంది మాత్రమే జిల్లా జట్టుకు ఎంపికవుతారన్నారు.అటువంటి ప్రతిభావంతులు ఇక్కడికి రావడం అభినందనీయమని అన్నారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా స్వీకరించాలని సూచించారు.
జీవిత పాఠాలు నేర్పే క్రీడలు..
నిజ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుకు 60శాతం, క్రీడలకు40 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా క్రీడల వల్లే వస్తుందన్నారు.దూర ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు మంచి భోజన వసతి కల్పించాలని నిర్వాహకులకు ఆదేశించారు. మండల, గ్రామ పార్టీ పక్షాన టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఇక్కడ ఉన్న సౌకర్యాలతో సర్దుకుపోయే తత్వాన్ని అలవర్చుకుంటారన్నారు.త్వరలో జరగబోయే వాలీబాల్ టోర్నమెంట్కు కూడా తమ వంతు సహాయం అందిస్తామని, పిల్లల భవిష్యత్తు కోసం క్రీడలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంటును ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, క్రీడా సంఘం బాధ్యులు సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శోభన్, నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగమణి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్,పిఈటిలు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, నీరజ రెడ్డి, రాష్ట్ర స్థాయి పరిశీలకులు,సెలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




