– పంటల్లో వైవిధ్యం రైతు ఆదాయానికి తొలిమెట్టు
– మినుము సాగుతో
– రైతుకు రొక్కం నేలకు సారం
– సంవత్సర కాలంలో ఒకే క్షేత్రంలో 3 పంటలు తో రైతుకు అదనపు ఆదాయం
– ఏడీఏ పి.రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయంలో ఒడిదుడుకులను తట్టుకొని రైతులు మనోధైర్యంతో పంటలు సాగు చేస్తారు. అతివృష్టి,అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ మాయాజాలం,నానాటికి పెరుగుతున్న ఉత్పాదక వ్యయం అన్నింటిని ఎదుర్కొని సేద్యం చేస్తారు. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ లో కొందరు రైతులు వైవిధ్యంగా మినుము సాగు చేసి సఫలీకృతం అవుతున్నారు. మినుము సాగుతో రైతుకు రొక్కం మరియు మృత్తికా సారం మెరుగు అవుతుంది. 80 రోజుల పంట కాలంలో అటు మినుము ఉత్పత్తికి తోడుగా నేలకు సేంద్రియ పదార్ధాన్ని అందించడం ద్వారా నేలకు సత్తువ చేకూరుతుంది.
జిల్లాలో అపరాల సాగు అంతంత మాత్రమే అయినప్పటికీ అశ్వారావుపేట డివిజన్ లో మాత్రం గణనీయమైన విస్తీర్ణంలో మినుము సాగుచేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వానాకాలం సీజనులో సరాసరి 729 ఎకరాల విస్తీర్ణంలో మినుము సాగు అవుతుంది. వర్షాధారంగా పత్తికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మినుము సాగులోవుంది.ముఖ్యంగా అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లోని రైతులు మినుము సాగు పై ఆశక్తి చూపుతున్నారు. దీంతో రైతులను మినుము సాగు దిశగా ప్రోత్సహించడానికి ఈ వానాకాలం సీజనులో
జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ పధకం ద్వారా 155 క్వింటాళ్ళ మినుము విత్తనాలను రాయితీ పై 1938 ఎకరాలకు సరిపడా వ్యవసాయ శాఖ రైతులకు అందజేసింది.
మండలం విత్తనం క్వింటాల్లో ఎకరాల్లో
అన్నపురెడ్డిపల్లి 10 125
అశ్వారావుపేట 73.80 922
చండ్రుగొండ 15 188
దమ్మపేట 15 188
ములకలపల్లి 41.20 515
మొత్తం 155 1939
లేత ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగాను, ఏక పంటగాను వివిధ పద్దతుల్లో మినుము ను సాగు చేస్తున్నారు.
మినుము సాగు – ఆదాయ వ్యయాలు :
విత్తనం రకం : 1624
వ్యయం :
దుక్కుల వ్యయం :రూ. 4500
దుక్కిలో ఎరువులు: రూ.2600 లు
కలుపు మందు : రూ.1500
పై పాటు లో ఎరువులు : రూ.1850 లు
సస్యరక్షణ : రూ. 6200 లు
కోత,నూర్పిడి : రూ.4600 లు
మొత్తం : రూ.22,874 లు
ఆదాయం :
దిగుబడి 6.50 క్వింటాలు.
క్వింటాలు కి రూ.7,000 లు చొప్పున రాబడి రూ.45.500 లు.
ఎకరా కు నికర ఆదాయం రూ.22.626 లు. మినుము విత్తనాలు నాటి నప్పటి నుండి కోత వరకు మొత్తం 75 నుండి 80 రోజుల్లో పంట చేతి కొస్తుంది.అంటే సుమారు మొత్తం 3 నెలల కాలంలో ఎకరాకు రూ. 22,626 నికరాదాయం సమకూరుతుంది. వ్యవసాయ శాఖ ఇస్తున్న ప్రోత్సాహంతో మినుము సాగు ఈ వానాకాలంలో మూడింతల అయ్యింది. అపరాల సాగు పొలానికి భూసారాన్ని పెంపొదిస్తుంది.మరొకవైపు రైతుకు కూడ స్వల్పకాలంలో ఆదాయం చేతికందుతుంది.
జులై 15 న మొదలైన మినుము సాగు, ప్రస్తుతం ఆగష్టు చివరి వరకు విత్తనాలు వేస్తారు.సెప్టెంబరు చివరి వరకు పంట కాలం పూర్తి అయిపోతుంది. నీటి వసతి వున్న రైతులు అక్టోబరు నుండి వేరుశనగ లేదా విత్తన మొక్కజొన్న సాగుచేస్తారు. పంటల సరళిలో అపరాల పంటలను తప్పకుండా సాగు చేయాల్సిన అవసరం నెలకొంది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట రైతులు అవలంబిస్తున్న పంట మార్పిడి విధానంతో ఒక సంవత్సరంలో ఒకే క్షేత్రంలో లో మూడు పంటలు సాగు చేయడం నిజంగా స్ఫూర్తిదాయకం.