Thursday, November 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యత

కాంగ్రెస్‌ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యత

- Advertisement -

సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌కు డీఎస్పీగా అవకాశం ఇచ్చాం..
అజారుద్దీన్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి ఇబ్బందేంటి?
కిషన్‌రెడ్డికి దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలి
మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ ఏం అభివృద్ధి చేశారు?
400 కోట్లతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేశాం : షేక్‌పేట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-సిటీబ్యూరో /జూబ్లీహిల్స్‌
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌, నికత్‌ జరీన్‌కు డీఎస్పీగా, అజారుద్దీన్‌కు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం షేక్‌పేట్‌ డివిజన్‌లోని పారామౌంట్‌ కాలనీలో రోడ్‌ షో, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వరకు జరిగిన రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రసంగించారు. ‘జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సమస్యలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కారణం. మేం రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం. నవీన్‌ యాదవ్‌ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం.

హైదరాబాద్‌లో మూసీ రివర్‌ఫ్రంట్‌ ఎందుకు కట్టకూడదో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. సవాల్‌ విసిరితే ఎందుకు స్పందించడం లేదు? నిన్న నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. మొదటి నుంచి నేను సెక్యులర్‌ భావాలు ఉన్న వ్యక్తిని. కొడంగల్‌లో నేను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఉంది. 20 నెలల కాంగ్రెస్‌ పాలనలో మైనార్టీలకు ఇబ్బందులు లేకుండా చూశాం. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే.. కేసీఆర్‌ ప్రతిసారీ కేంద్రంలో మోడీకి మద్దతు ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ముస్లింలను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో కేసీఆర్‌, మోడీ ఒక వైపు.. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి, అసదుద్దీన్‌ మరోవైపు. సవాల్‌ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటుగా ఉంది. కేసీఆర్‌ పదేండ్లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారా?” అని సీఎం ప్రశ్నించారు.

సినిమా పరిశ్రమకు అండగా కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు అండగా నిలబడ్డాయని సీఎం చెప్పారు. ”కేసీఆర్‌ పదేండ్లు అధికారంలో ఉన్నా నంది అవార్డులు ఇవ్వలేదు. మా ప్రభుత్వం గద్దర్‌ అవార్డులు ఇచ్చింది. కేటీఆర్‌ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదు. మేము సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం. వారి పిల్లల కోసం స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. మాగంటి గోపి సతీమణిని గెలిపించాలని కేటీఆర్‌, హరీశ్‌రావు సెంటిమెంట్‌ పేరుతో తిరుగుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి.. కాంగ్రెస్‌ను ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ చేయలేదు.

కిషన్‌రెడ్డి ముందు మోడీ ఇంటికి వెళ్లి గజదొంగ కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో అడుగు? కిషన్‌రెడ్డి.. నీకు ఎవరూ భయపడరు.. కేసీఆర్‌నే ఓడించి ఫామ్‌హౌస్‌కి పంపాం.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టాలి. నవీన్‌ యాదవ్‌ విజయం సాధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. నవీన్‌ యాదవ్‌కి 30 వేల మెజార్టీ ఇవ్వాలి” అని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వివేక్‌, కొండా సురేఖ, అజారుద్దీన్‌, జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌, ఎంపీ అనిల్‌ యాదవ్‌, ఎంఐఎం ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -