నీ అంతు చూస్తానంటూ బెదిరింపులు
వరద బాధితులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్నందుకు..
నవతెలంగాణ-సిటీబ్యూరో
వరద బాధితులకు నాణ్యమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేసిన సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యదర్శివర్గ సభ్యులు మహేందర్పై అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దౌర్జన్యానికి దిగారు. దూషిస్తూ, నీ అంతు చూస్తానంటూ బెదిరించారు. వివరాల్లోకెళ్తే.. మంగళవారం అంబర్పేట్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అధికారులు వరద బాధితులకు బియ్యం పంపిణీ చేపట్టారు. అయితే, పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేయడంపై ప్రజలు, సీపీఐ(ఎం) నాయకులు, ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం ఇవ్వాలని సీపీఐ(ఎం) నాయకులు మహేందర్ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వెంకటేశ్.. మహేందర్ను దూషించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించారు.
ఎమ్మెల్యే తీరుపై నిరసన
ఎమ్మెల్యే తీరుపై స్థానికులు, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) నేతపై ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మహేష్, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.