నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారురాలు గుడాల్వర్ సవితను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు కాలేదని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు మన జుక్కల్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశం జరుగుతుండగా మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నదే తన ఆశయం అని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.




