జీ20 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
జోహన్స్బర్గ్: ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. జీ20 వార్షిక సమావేశం నిమిత్తం ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది సమావేశం దక్షిణాఫ్రికా అధ్యక్షతన జరుగుతోంది. వాటర్క్లూఫ్ ఎయిర్ఫోర్స్ బేస్లో దిగిన ప్రధాని మోడీకి దక్షిణాఫ్రికా అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక సాంస్కృతిక కళా ప్రదర్శనలతో ఆహ్వానించారు. ”జీ20 సమావేశం కోసం జోహన్స్బర్గ్కు చేరుకున్నాను. కీలక అంశాలపై ప్రపంచాధినేతలతో చర్చించనున్నారు. వివిధ దేశాలతో సహకారాన్ని పెంపొం దించుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, తద్వారా యావత్ ప్రజానీకానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యం” అని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఆఫ్రికాలో జరుగుతున్న మొదటి జీ20 సమావేశం ఇది. 2023లో భారత అధ్యక్షతన జరిగిన సమ్మిట్లోనే ఆఫ్రికన్ యూనియన్కు జీ20 కూటమిలో సభ్యత్వం లభించింది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే మోడీ పలువురు ప్రపంచాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో కూడిన ఐబీఎస్ఏ కూటమి ఆరో త్రైపాక్షిక సమావేశంలోనూ మోడీ పాల్గొననున్నారు. ప్రవాస భారతీయులనూ పలకరించనున్నారు. ఈ జీ20 సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కావడం లేదని అధికారవర్గాలు తెలిపాయి.



