నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్టకేలకు సాంకేతిక విద్యాబోధనకు మార్గం సుగమమైంది. మండలంలోని ఏడు పాఠశాలలకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. నియమితులైన వారు ఇప్పటికే విధుల్లో చేరినట్లు ఎంఈఓ ప్రసాదరావు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం ‘పాఠశాలలో సాగని సాంకేతిక విద్యాబోధన’ శీర్షికన ‘నవతెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. 2024లో ఆయా పాఠశాలలకు ఐదు కంప్యూటర్లు, ప్యానెల్ బోర్డులు అందించినప్పటికీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను నియమించకపోవడంతో అవి వినియోగానికి నోచుకోకపోతున్న విషయాన్ని కథనంలో ప్రస్తావించింది.
దీంతో స్పందించిన ఉన్నతాధికారులు మండలంలోని ఎంయూపీఎస్ నందిపాడు, జడ్పీహెచ్ఎస్ గుమ్మడవెల్లి, జడ్పీహెచ్ఎస్ నారాయణపురం, జడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట బాలికలు, జడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట, జడ్పీహెచ్ఎస్ అచ్యుతాపురం, పీఎం శ్రీ నారంవారిగూడెం పాఠశాలలకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు.
ఇకపై ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ప్రారంభం కానుంది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న కంప్యూటర్లు, ప్యానెల్ బోర్డులు సద్వినియోగం కానున్నాయి. సాంకేతిక విద్యా బోధన ప్రారంభం కావడం తో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మడివి క్రిష్ణా రావు,తాళ్ళపాటి వీరేశ్వరరావు,సింగపోగు వెంకటేశ్వరరావు,నల్లపు కొండలరావు,పి.హరిత,ఎస్కే షాహినా బేగం, చంద్రశేఖర్ లు హర్షం వ్యక్తం చేశారు.



