500కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మొంథా తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణపైనా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 508 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్, నాగర్కర్నూల్, నల్లగొండ, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, గద్వాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.
కొమ్రంభీం అసిఫాబాద్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాలు ఎల్లో హెచ్చరిక జాబితాలో ఉన్నాయి. ఆ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయనీ, ఉరుములు, మెరుపులతో వర్షాలు పలుచోట్ల పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 30న రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షం, 31న భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.



