ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్
నవతెలంగాణ- కంఠేశ్వర్
తీవ్ర గందరగోళంగా ఉన్న ఓటర్ జాబితాను సవరించిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో గల 60 డివిజన్లోని ఓటరు జాబితా పూర్తిగా తప్పులు తడకగా ఉందని, ఓటర్లను గందరగోళంలో పడేసే విధంగా జాబితా ఉందని ఆయన విమర్శించారు.
ఒక్కో డివిజన్లో వందలాది ఓట్లు గల్లంతయాయని, ఒక డివిజన్ పరిధిలో రావాల్సిన ఓటర్లు మరొక డివిజన్లో రావడం, కార్పొరేషన్ పరిధిలో లేని ప్రాంతాల ఓటర్లను కూడా కార్పొరేషన్ పరిధిలో కలపడం, చూస్తే చిత్ర, విచిత్రంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఓటర్ జాబితాతో ఎలక్షన్ వెళ్లడం అసాధ్యమని, తక్షణమే అధికారులు స్పందించి ఓటరు జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతే ఎలక్షన్ కు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.



