పుట్టిన రోజును నోట్ చేయని కాలంలో… కష్ణా జిల్లాలోని బందరు దగ్గర వున్న పోతిరెడ్డిపాలెంలో పుట్టింది మా అమ్మమ్మ (తాయారమ్మ). నేను, మా చెల్లి చిన్నప్పుడు… అమ్మమ్మ పుట్టిన రోజును ఫస్ట్ జనవరి అని ఫిక్స్ చేశాం. ఆ తరువాత కొన్ని లెక్కలు వేసి ఆమెకు ఇప్పుడు 79 ఏండ్లు ఉండొచ్చని ఒక నిర్ధారణకు వచ్చాం. తాను మహిళా ఉద్యమం(ఐద్వా)లో పని చేయడమే కాక తన ముగ్గురు ఆడపిల్లలను సైతం ఉద్యమానికి పరిచయం చేసిన అమ్మమ్మ ఇటీవలె క్యాన్సర్తో మరణించింది. ఆమె జ్ఞాపకాలు, అప్పుడప్పుడు మాతో చెప్పిన విశేషాలు ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
నలుగురు చెల్లెళ్ళు, అయిదుగురు అన్నదమ్ముల మధ్య పెరిగింది అమ్మమ్మ. అందరిలో రెండవ సంతానం. పోతిరెడ్డిపాలెంలో మొక్కలు బాగా పెంచేది. సముద్రం దగ్గరే ఉండడం వల్ల చాపలు తినడం, వండడంలో ఆమె ఎక్స్పర్ట్. అందరూ కలిసి ఎడ్ల బండి కట్టించుకొని బందరుకు వెళ్ళి సినిమాలు చూసేవారు. తోటల్లో చెట్లు ఎక్కి మామిడి కాయలు కోసుకుని తినేవారట. ‘సపోటా చెట్టు అందరికంటే నేనే బాగా ఎక్కేదాన్ని’ అంటూ ఆసుపత్రిలో చివరి దశలో ఉన్నపుడు మా అన్న అనీష్తో గర్వంగా తన జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
ఇంట్లో అందరికన్నా పెద్దమ్మాయి కావడంతో, చిన్నప్పటినుంచే వంట బాధ్యత ఆమె మీద పడింది. రోజూ ఉదయాన్నే గ్లాస్ నిండా కాఫీ పోసుకొని తాగి వంట పనుల్లోకి దిగేది. ఆడపిల్లలు చదువుకోకూడదు అనుకునే కుటుంబంలో పుట్టినప్పటికీ చదువుకోవాలని తపించింది. ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసి స్కూల్కి వెళ్ళేదట. అప్పుడు, వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్లి అమ్మమ్మని ఇంటికి తిరిగి తీసుకొచ్చేసేది. స్కూల్ టీచర్ ఇంటికి వచ్చి పిల్లలను స్కూల్కు పంపమని అడిగినప్పటికీ వాళ్ళ అమ్మ పంపలేదట. స్కూల్కి వెళ్లాలని అమ్మమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసిందో… వెళ్ళనివ్వకుండా వాళ్ళ అమ్మ అన్ని ప్రయత్నాలూ చేసేది. అలా స్కూల్ మొహం చూడకుండానే ఆమె బాల్యం పూర్తయ్యింది.
అమ్మమ్మ వాళ్ళ నాన్న చాలా నిదానస్తులు. ఆయన పోతిరెడ్డిపాలెంలో బ్రాంచ్ పోస్ట్మాస్టర్గా పనిచేసేవారు. కూతురికి మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. మోపర్రులో ఒక కుర్రాడు పోస్ట్మాస్టర్గా పనిచేస్తున్నాడని, చాలా మంచివాడని ఎవరో చెప్పారు. అది తెలుసుకొని రోజూ మోపర్రు వెళ్లి మా తాతయ్యతో మాట్లాడేవారట. అలా మాట్లాడాక అమ్మమ్మకు, తాతయ్య (కంచి ముత్యాలు)కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తాతయ్యకు పోస్టల్ యూనియన్ మీద ఉన్నంత ఆసక్తి పెళ్లి మీద లేదు. అయినప్పటికీ తాతయ్యను పెళ్లికి ఒప్పించారు. అమ్మమ్మకి సుమారు 16 ఏండ్లు ఉన్నప్పుడు అంటే 1963లో తాతయ్యతో పెళ్లి జరిగింది. సగటు పల్లెటూరి పిల్లగా పెరిగిన అమ్మమ్మకు తాతయ్యవల్లే సమాజం, వామపక్ష భావం, క్లాస్ యాంగిల్ విషయాలతో పరిచయమయ్యింది. ఇల్లు, వంటిల్లు నుండి బయటకు వచ్చి ఉద్యమాల్లో పాల్గొంది.
పెళ్లి అయిన మూడేండ్లకు మా పెద్దమ్మ నాగలక్ష్మి పుట్టింది. ఆమె ఆరు నెలల పాపగా ఉన్నప్పుడు అమ్మమ్మను మోపర్రులో వదిలి యూనియన్ పనుల కోసం హైదరాబాద్ వెళ్లారు తాతయ్య. యూనియన్ పనుల్లో మునిగి ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. పెద్దమ్మను తీసుకొని అమ్మమ్మ పుట్టింటికి వెళ్ళింది. అక్కడ చుట్టుపక్కల వారు అనే మాటలను భరిస్తూ ఏడాది గడిపింది. అప్పట్లో ఫోన్లు లేకపోవడంతో కమ్యూనికేషన్కు ఉత్తరాలపైనే ఆధారపడేవారు. రోజూ ఉదయాన్నే లేచి తాతయ్య ఉత్తరం కోసం ఎదురుచూసే దాన్నని అమ్మమ్మ నాతో చెప్పింది. ఇక అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఆమెను పక్క ఊరులోని జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకెళ్లింది. జ్యోతిష్కుడు అమ్మమ్మ జాతకం చూసి ‘మీ ఆయన ఇక తిరిగిరాడు, హైదరాబాదులో ఇంకో కాపురం పెట్టాడు’ అని చెప్పాడట. అది విని అమ్మమ్మ దిగ్బ్రాంతి చెందింది. పూజలు చేస్తే తాతయ్య తిరిగి వస్తాడని పూజలు కూడా చేసిందట. ఇలా ఎదురుచూపులు సాగుతుండగా ఒక రోజు తాతయ్య వచ్చాడు. యూనియన్ పనులలో బిజీగా ఉండి లెటర్ రాయలేకపోయానని సంజాయిషీ ఇచ్చాడు. తర్వాత అమ్మమ్మను, పెద్దమ్మను హైదరాబాద్ తీసుకెళ్ళాడు. అలా అప్పట్లో తెలియక జ్యోతిష్యాలు నమ్మి, పూజలు చేశానని తనను తాను విమర్శించుకుంటూ ఉండేది.
హైదరాబాద్లో రెండో కూతురు అరుణ పుట్టింది. యూనియన్ పనులతో ఆఫీసుకు సరిగా వెళ్ళక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. తాతయ్యకు హైదరాబాద్ నుండి తిరువూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడే మా అమ్మ లలిత పుట్టింది. అలా ట్రాన్స్ఫర్ అవుతూ మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ తిరిగారు. 1973లో కొడుకు వాసు పుట్టాడు. ఆ తర్వాత బందరులో స్థిరపడ్డారు. 1980లో అమ్మమ్మ జీవితంలో ఒక విషాదం జరిగింది. గోడ కూలి కొడుకు చనిపోయాడు. ఆ బాధ నుండి అమ్మమ్మ కోలుకోలేకపోయింది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుచేసుకుని బాధపడేది. ఆ బాధ నుంచి బయటపడడానికి తాతయ్య అమ్మమ్మను డాక్టర్ హేమలత గారికి పరిచయం చేశారు. హేమలత గారు బందరులో అప్పటికే ప్రజావైద్యశాల ఏర్పాటుచేసి ప్రజలకు అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలందించేవారు. అంతేకాదు మహిళల, ప్రజా సమస్యలపై పనిచేసేవారు. హేమలత గారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మరీ ఎన్నో విషయాలు చెప్పి ఆమెలో స్ఫూర్తి నింపారు. శ్యామ్ బాబు గారు, మధుసూదనరావు గారు, తాతయ్య వాళ్ళు… ఈ మూడు కుటుంబాలు కలిసి ఒకే కాంప్లెక్స్లో ఇళ్లు రెంటుకు తీసుకున్నారు. అప్పట్లో బందరులో సీపీఐ(ఎం) పార్టీ నిర్మాణానికి ఈ ముగ్గురు చాలా కషి చేశారు. హేమలతగారి ప్రోత్సాహంతో అమ్మమ్మ ఐద్వా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించింది.
మచిలీపట్నంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి బిందెలు పట్టుకొని ర్యాలీలు తీశారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేశారు. ఐద్వా సభ్యత్వం కోసం చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగేది అమ్మమ్మ. అలా పార్టీ, ఐద్వా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఎంతో మంది సామాన్య కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తేనే ఒక సంస్థ అభివృద్ధి చెందుతుంది. అలా తుది వరకూ పార్టీ పట్ల, ఐద్వా పట్ల అంకితభావంతో పని చేసింది మా అమ్మమ్మ.
బందరులో తుఫాను వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో శరణార్థులకు భోజనం తయారు చేసే టీమ్లో మా అమ్మమ్మ కీలక పాత్ర పోషించింది. అప్పుడే శ్యామ్ బాబు గారు అమ్మమ్మకి అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టారు. పోస్టల్ యూనియన్ పనుల కోసం ఇంటికి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ భోజనాలు పెట్టేది. పండుగలు వచ్చినప్పుడు మోపిదేవిలో తాతయ్య పోస్టాఫీసు సిబ్బందిని ఇంటికి పిలిచి కులవివక్షకు వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసేవారు. వారికి అమ్మమ్మ ఎంతో ఆప్యాయంగా వంటలు చేసి వడ్డించేది. స్కూలుకి వెళ్ళని అమ్మమ్మను మా పెద్దమ్మ ప్రోత్సహించి చదువు నేర్పింది. చదువు మీద ఆసక్తితో అమ్మమ్మ కూడా తెలుగు చదవడం, రాయడం నేర్చుకుంది. చివరి వరకూ ప్రజాశక్తి/ నవతెలంగాణ పేపర్ను రోజూ చదివి కరెంట్ అఫైర్స్ మాతో డిస్కస్ చేసేది.
ఒక రోజు బందరులో మార్కెట్కు వెళ్లొచ్చి తాతయ్యతో ఏంటి సరుకుల రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి అంటే… దానికి ఆయన ‘ప్రైమ్ మినిస్టర్ని అడుగు’ అన్నారు. అప్పుడు అమ్మమ్మ అప్పటి ప్రధాని వీపీ సింగ్కు ఉత్తరం రాసింది. ఉత్తరాన్ని తాతయ్యే స్వయంగా పోస్ట్ చేశారట. ఈ విషయాన్ని పరిశీలిస్తామని పీఎంఓ నుండి జవాబు కూడా వచ్చిందని గర్వంగా చెప్పింది. ఇప్పటి ప్రభుత్వం అయితే అలా ఉత్తరం రాస్తే మనల్ని దేశద్రోహులంటారని నవ్వుతూ అనేది.
ఇలా సాగుతూ ఉండగా 1992లో తాతయ్య రిటైరయ్యారు. సుదీర్ఘకాలం ఉద్యమాలలో పనిచేసిన తాతయ్య అనుభవం రాష్ట్ర ఉద్యమానికి అవసరమని, అప్పటి సీఐటీయూ నాయకులు నండూరి ప్రసాద్రావు గారు, పర్సా సత్యనారాయణ గారు తాతయ్యను హైదరాబాదుకు రమ్మని కోరారట. దానితో కుటుంబమంతా హైదరాబాదుకు మకాం మార్చింది. హైదరాబాద్లో కూడా అమ్మమ్మ ఐద్వా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. పార్టీ సభ్యురాలిగా యూనిట్ మీటింగ్లకు కచ్చితంగా సమయానికి అటెండ్ అయ్యేది. కూతుర్లను సామాజిక దక్పథంతో పెంచారు అమ్మమ్మ, తాతయ్య. బాగా చదివించి గ్రాడ్యుయేట్లను చేశారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యక్రమాలలో పాల్గొనాలని ప్రోత్సహించారు. పార్టీలో యాక్టివ్గా పనిచేసే వారికిచ్చి పెళ్లి చేశారు.
2024 ఏప్రిల్లో అమ్మమ్మకు బ్లడ్ క్యాన్సరని తెలిసింది. అలా ఓ ఏడాది పాటు క్యాన్సర్తో పోరాడింది. ఆమె గుండె ధైర్యాన్ని చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. 2025 మే 20న 1:53 నిమిషాలకు ఆ గుండె చివరిసారి కొట్టుకుంది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ హేమలతగారు చాలా బిజీ షెడ్యూల్లోనూ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు కేవలం అమ్మమ్మ కోసమే వచ్చి చివరి దశలో ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మమ్మకు ఉద్యమ జీవితాన్ని పరిచయం చేసిన హేమలతగారే ఆమెతో చివరిసారి మాట్లాడటం మాకు యాదృచ్ఛికంగా అనిపించింది.
అమ్మమ్మ నిరంతరం తన జ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించేది. జ్యోతిష్యాలను నమ్మే స్థాయి నుండి చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలని తన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేసే స్థాయికి ఎదిగింది. కూతుర్లకు ఆదర్శ వివాహాలు చేసింది. స్మార్ట్ ఫోన్ వాడే అంత స్మార్ట్ అయ్యింది. పుస్తకాలు చదివి మాతో చర్చలు జరిపేది. మాలో స్ఫూర్తి నింపేందుకు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెబుతుండేది. గొప్ప పనులు చేసిన నేతలెందరో ఉన్నారు. కానీ తన పరిధిలో తనకు చేతనైనంతే కాక, తన పరిధికంటే ఎక్కువే చేసిన మా అమ్మమ్మ నా దృష్టిలో ఎప్పుడూ హీరోనే.
– శ్వేత, ఎంటెక్
8333040365
అమ్మమ్మకు నా నివాళి
- Advertisement -
- Advertisement -