నవతెలంగాణ – రాయికల్
మయన్మార్లోని సైబర్ నేరగాళ్ల శిబిరాల్లో బంధించబడ్డ భారతీయులలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో మోసరపు రాజు, గణేష్ చంద్ర భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీలోకి చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాయికల్ పట్టణానికి చెందిన మోసరపు రాజు సుమారు నాలుగు నెలల క్రితం ఉద్యోగం పేరుతో మయన్మార్ వెళ్లాడు. మొదట పని బాగానే ఉందని తెలిపినా.. తరువాత సైబర్ నేరగాళ్లు తమ వద్ద బలవంతంగా పని చేయించుకుంటున్నారని ఫోన్లో తన భార్య నవ్యశ్రీకి తెలిపాడు. నాలుగు లక్షలు ఇస్తేనే భారత్కు పంపిస్తామని బెదిరించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత నుంచి ఆయనతో సంబంధం తెగిపోయింది.
ఇక రాయికల్ పట్టణంలోని భరతమాత కూడలి ప్రాంతానికి చెందిన గణేష్ చంద్ర కూడా మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి మయన్మార్ వెళ్లాడు. అక్కడ సైబర్ నేరగాళ్ల శిబిరాల్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారని సమాచారం. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో మయన్మార్లో చిక్కుకున్న మొత్తం 270 మంది భారతీయులను రక్షించి స్వదేశానికి తీసుకువచ్చారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 23 మంది కాగ ఇందులో రాయికల్ పట్టణానికి చెందిన ఈ ఇద్దరు యువకులు ఉండటం స్థానికుల్లో ఉపశమనం కలిగించింది. కుటుంబ సభ్యులు వారిని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం,విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.



