అధికారికంగా ప్రారంభించిన క్రీడామంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్ : జాతీయ 17వ మినీ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన ఆరంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి.. తెలంగాణ, అస్సాం మ్యాచ్తో పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మంచి సహకారం అందిస్తోంది. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడలు యువతలో మానసిక, శారీరక వికాసానికి దోహదం చేస్తాయి. రాష్ట్రంలో హ్యాండ్బాల్ అభివద్దికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని’ అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి, హెచ్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీ ప్రీత్పాల్ సింగ్ సలూజ , తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు మల్రెడ్డి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్కుమార్ సహా చిత్ర తిరుమల్ రెడ్డి, కానపర్తి రమేశ్, ఎస్ఆర్ సంజీవ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అండర్-12 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు జరుగనుండగా.. 22 రాష్ట్రాల నుంచి జట్లు పోటీపడుతున్నాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో అస్సాంపై తెలంగాణ ఘన విజయం సాధించింది.