కోఠిలో భారీ ధర్నా…తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు భూపాల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని కోఠి కమిషనరేట్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కట్టడి చేశారు. లోపలికి ఎవరినీ వెళ్ళకుండా బారికేడ్లు వేసి అడ్డుకోవడంతో ప్రధాన గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, నర్సింగ్ కేడర్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, హాస్పిటల్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి. ఫసియొద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో భూపాల్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు 16 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామన్నారు. వాటిని పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. 14 మంది యూనియన్ ప్రతినిధులు కమిషనర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రెెటరీ గోపీకాంత్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిపారు. ఏఎన్ఎం, ఫార్మాసిస్ట్ల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ వెంటనే విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నర్సింగ్ ఆఫీసర్ల సెలక్షన్ లిస్ట్ ఈ నెలాఖరు లోపు ఇస్తామనీ, 104 ఉద్యోగుల బకాయి వేతనాలు ఇప్పిండానికి కృషి చేస్తామని కమిషనర్ హామీనిచ్చారు. హాస్పిటల్ వర్కర్ల జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అంగీకరించారు. ఏఎన్ఎంల సమస్యలపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని తెలిపారు. వేతనాలు పెంపుదల, ఎరియర్స్, పని భారం, అబాస్ రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పరిశీలిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. యాదానాయక్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. పద్మశ్రీ, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. విజయవర్ధన్రాాజు, జె. సుధాకర్, రాష్ట్ర కార్యదర్శులు కిరణ్మయి, నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ అధ్యక్షులు గిరి యాదయ్య, నర్సింగ్ కేడర్ సుష్మ, ఫార్మాసిస్ట్ అజరు, హాస్పిటల్ వర్కర్స్ జి. యాదగిరి, ఎఎన్ఎం పుష్పలత, సరోజ, 104 రాష్ట్ర కార్యదర్శి నవీన్కుమార్, సుభాశ్చంద్ర, గోపాల్, హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు జె. కుమారస్వామి, సిరిసిల్లా సదానందం తదితరులు మాట్లాడారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



