– రాజకీయపార్టీలకిచ్చే ప్రతీ విరాళాన్ని ఆదాయపన్ను పరిధిలోకి తేవాలి
– సుప్రీంలో పిటిషన్ దాఖలు ొ విచారణకు స్వీకరించిన బెంచ్
న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు రూ.2వేల వరకు నగదు విరాళాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నారన్న దానితో నిమిత్తం లేకుండా పారదర్శకత కోసం ప్రతి రాజకీయ విరాళాన్ని ఆదాయపన్ను పరిధి కిందకు తీసుకురావాలని పిటిషన్ కోరుతోంది. రూ.2వేల నగదు విరాళాలైనా సరే రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిందేనని, ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఏ పార్టీని మినహాయించరాదని పిటిషన్ కోరుతోంది. తమ దాతల వివరాలను పూర్తిగా ఆ పార్టీలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటోంది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ నోటీసులు జారీ చేసింది.
తమకు చెల్లించే మొత్తం ఎంతైనా సరే దానితో సంబంధం లేకుండా ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలి. రాజకీయ విరాళాల విషయంలో పారదర్శకత పాటించడం కోసం నగదుగా ఎంత మొత్తమైనా సరే స్వీకరించరాదని పిటిషన్ కోరింది.
భారత ఎన్నికల కమిషన్తోపాటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా మొత్తంగా 14 రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా పిటిషన్ చేర్చింది.
ఖెమ్ సింగ్ భాటి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది విజరు హన్సారియా వాదనలు వినిపిస్తారు. ఆదాయపన్ను చట్టం, 1961లోని సెక్షన్ 13ఎ క్లాజు (డి) చెల్లుబాటును ఈ పిటిషన్ సవాలు చేసింది. రాజకీయ పార్టీలకు ఆదాయపన్ను మినహాయింపును అనుమతించే ప్రత్యేక నిబంధన సెక్షన్ 13ఎ. రూ.2వేలు వరకు నగదు రూపంలో విరాళాలను స్వీకరించేందుకు పార్టీలను క్లాజు (డి) అనుమతిస్తోంది. సెక్షన్ 13ఎ (డి)లో ఒక లొసుగు వుందని పిటిషనర్ వాదించారు. ఈ లొసుగును ఉపయోగించుకుని అజ్ఞాత దాత రూ.2వేలు వరకు నగదు మొత్తాల చొప్పున ఒక రాజకీయ పార్టీకి ఎన్నిసార్లైనా డిజిటల్ చెల్లింపుల ద్వారా పెద్ద మొత్తాన్ని అందచేయవచ్చని ఆ పిటిషన్ పేర్కొంటోంది. ఈ సెక్షన్ 13ఎ(డి) విరాళాలకు సంబంధించి 19వ అధికరణ (1)(ఎ)ను ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్ వాదించింది. ఈ పిటిషన్పై రెండు మూడు వారాల తర్వాత విచారణ జరిపేందుకు బెంచ్ అంగీకరించింది. జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు అందుకునే మొత్తాల్లో దాదాపు 60శాతం అజ్ఞాత వనరుల నుండే వస్తున్నా యి. రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఆడిట్ నివేదికలు, విరాళాల రిపోర్టులన విశ్లేషిస్తే అవన్నీ కూడా అసంపూర్తిగానే వున్నాయి, పూర్తి వివరాలేవీ కూడా వెల్లడించలేదని పిటిషన్ పేర్కొంది.
రూ.2వేల వరకూ నగదు విరాళాలు వద్దు
- Advertisement -
- Advertisement -



