బొగ్గు కుంభకోణం బయటపడుతుందనే నోటీసులు
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, మెదక్ టౌన్
”నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడ్తం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు.. హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తునారని అన్నారు. నిన్న తనకు నోటీసులు ఇచ్చారని, నేడు కేటీఆర్కు ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్ ఒకవైపు నుంచి నిలదీస్తుండని, ఇంకోవైపు నుంచి తాను అడుగుతూనే ఉన్నానని, అయినా ఎలాంటి సమాధానాల్లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదికే నువ్వు సాయం చేసి.. ఇప్పుడు తాము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడం లేదని అన్నారు. మాపై విరుచుపడితే లాభం లేదని, సిట్ నోటీసులు ఇస్తే భయపడతామనుకున్నావా అంటూ సీఎంను ప్రశ్నించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వెంట పడు తూనే ఉంటామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయకుండా.. ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టూ తిరిగిలే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి కోసం చేసిన ఒక్క పని అయినా చూపించగలరా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హయాం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా గురించి ఊరించిందే తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు.



