Tuesday, June 10, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడలేదు

ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడలేదు

- Advertisement -

ఎవరికీ ఆదేశాలివ్వలేదు
సిట్‌ ఎదుట వాదించిన
ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌ రావు
కింది అధికారుల వాంగ్మూలంపై మౌనం
రివ్యూ కమిటీని ఎందుకు పిలువలేదు
అధికారులు వేసిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు
ఎనిమిదిన్నర గంటల పాటు సాగిన విచారణ
11న తిరిగి విచారణకు రావాలని సిట్‌ ఆదేశం


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

ఫోన్‌ ట్యాపింగ్‌కు తాను పాల్పడలేదనీ, ట్యాపింగ్‌ చేయాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలివ్వలేదని ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు స్పెషల్‌ టీం అధికారుల ఎదుట వాదించారు. సిట్‌ అధికారులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన ఎదురు ప్రశ్నలు వేసి దర్యాప్తు అధికారులను విస్మయ పర్చారు. సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌ రావు సోమవారం సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు విచారణకు హాజరై ఆయనను స్పెషల్‌ టీం అధికారులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పశ్చిమ మండల డీసీపీ విజయకుమార్‌ స్వీయ పర్యవేక్షణలో సిట్‌ ఏసీపీ వెంకటగిరితో పాటు మరో నలుగురు అధికారులు ఆయనను విచారించారు.

విచారణ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు రెండు గంటల పాటు ఫోన్‌ ట్యాపింగ్‌లో ప్రభాకర్‌రావుపై వచ్చిన ఆరోపణలపై మొదట అధికారులు వివరణలు తెలుసుకున్నట్టు తెలిసింది. ఆ సందర్భంలో తాను కోర్టుకు ఇచ్చిన సమాచారాన్నే మళ్లీమళ్లీ చెప్పినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే తమ కార్యాలయంలోని ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు, హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లను ఎందుకు ధ్వంసం చేయించారని అధికారులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు, మరో అదనపు డీసీపీ రాధాకిషన్‌రావులకు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయమంటూ మీరు కొన్ని నెంబర్లను ఇచ్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించగా, తాను ఎస్‌ఐబీకి సంబంధించి మాత్రమే ఆదేశాలిచ్చే వాడినని సమాధానం దాట వేశారని తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక మొదలుకుని సాధారణ ఎన్నికల వరకు ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, మరి కొంతమంది వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్‌కు ఆదేశాలివ్వడం నిజం కాదా అనే ప్రశ్నకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయనన్నట్టు సమాచారం.

ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి రివ్యూ కమిటీని పిలిచారా అని ఎదురు ప్రశ్నించగా, తానొక్కడే నిర్ణయాలు తీసుకున్నాననీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి వస్తుందని ఆయన అన్నట్టు తెలిసింది. సిట్‌ అధికారులు వేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానం దాట వేశారని తెలిసింది. దాదాపు 4,200కు పైగా ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు తాము ఇప్పటి వరకు జరిపిన విచారణలో బయటపడ్డట్టు అధికారులు తెలపగా, ఆ విషయం తనకు తెలియదని చెప్పారు.

రాజకీయ నాయకులకు ఇందులో సంబంధం ఉందా అనే ప్రశ్నకు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రణీత్‌రావు మిమ్మల్ని ట్యాపింగ్‌కు సంబంధించి ఎక్కువగా కలిశారా అనే ప్రశ్నకూ..పాలనా వ్యవహారాల్లో తనతో పలువురు సబార్డినేట్లు కలుస్తుంటారని అన్నట్టు తెలిసింది. మొత్తం మీద 8గంటల పాటు సాగిన విచారణలో ఆయన నుంచి సిట్‌ అధికారులు ఆశించిన సమాచారం రాబట్టలేక పోయినట్టు తెలిసింది. కొన్ని ఆధారాలను ఆయన ఎదుట పెట్టి ప్రశ్నించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో తిరిగి విచారణకు ఈ నెల 11న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా విచారణ ప్రక్రియను పూర్తిగా వీడియో చిత్రీకరణ చేశారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో ఆయన ముఖ కవళికలు, హావభావాలు ఏ మేరకు వాస్తవాలు చెప్పారనే విషయంలో తోడ్పడుతాయని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. విచారణ సాగుతున్నంత సేపు బీఆర్‌ఎస్‌ వర్గాలతో పాటు అధికార పక్షంలో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -