గెలుపు కోసం అభ్యర్థులు వ్యూహాలు
జోరుగా మద్యం,డబ్బులు పంపిణీ
నవతెలంగాణ – మల్హర్ రావు
మూడో విడత ఎన్నికలు జరిగే కాటారం,మల్హర్, మహముత్తరం, మహాదేవపూర్ మండలాల్లో సోమవారంతో ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజున అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశాక కొత్త అస్త్రాలను తీసే పనిలో పడ్డారు. పోలింగ్కు ఒకేరోజు సమయం ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలుస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు.81 జీపీల్లో,696 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.మండలంలో మొత్తం 15 జిపిలకు రెండు ఏకగ్రీవంగా 13 జిపిలకు 42 మంది సర్పంచ్ అభ్యర్థులు,, 128 వార్డులకు 26 ఏకగ్రీవం కాగా 102 వార్డు సభ్యులకు 237 మంది అభ్యర్థులకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల నాయకులతో కలిసి చివరి రోజైన సోమవారం వరకు ప్రచారం హోరెత్తించారు.
ప్రచారం ముగియడంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో ఎందరు ఓటర్లు ఉన్నారు,అందులో ఎవరెవరు తమకు ఓటు వేస్తారు…ఎవరిని ఎలా ప్రసన్నం చేసుకునే అవకాశముందనే అంశాలపై దృష్టి సారించారు. అంతేకాక ఎదుటి వర్గంలో పోటీ చేసే అవకాశం దక్కక నిరాశతో ఉన్నవారిని తమ వైపు తిప్పుకునేలా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో చేతులు కలపడం ద్వారా తమ గెలుపును సునాయాసం చేసుకోవాలనే భావనలో ఉన్నారు. ఓటరు జాబితా ఆధారంగా ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్రయత్నాలు మొద లుపెట్టారు.ఈక్రమంలో ఒకరిని మించి ఇంకొకరు మద్యం, డబ్బు పంపిణీ చేస్తుండగా,ఇంటింటికీ చికెన్ కూడా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.



