– ఉచిత పశువైద్య సేవలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మల్లాయిగూడెంలో కొనసాగుతున్న జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం ఆరవ రోజున వాలంటీర్లు గ్రామస్థుల కోసం పలు ప్రయోజనకర కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా నారాయణపురం పశువైద్యుడు డాక్టర్ వినయ్ పాల్గొని గ్రామంలోని పశువులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించారు.అనంతరం పశువులకు కృత్రిమ గర్భధారణ ప్రక్రియను నిర్వహించి,విద్యార్థులు,గ్రామ రైతులకు పశుసంరక్షణలో పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా వివరించారు.
తదుపరి వేరుసెనగ రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకొని సందేహాలను నివృత్తి చేశారు. జీవనియంత్రణ కారకాలలో ముఖ్యమైన ట్రైకోడెర్మాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే విధానం, దాని ప్రయోజనాలను యువ రైతులకు వివరించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ వక్క ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు తయారు చేసే విధానాన్ని తెలియజేసి,భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి. స్రవంతి, డాక్టర్ పి. ఝాన్సీ రాణి, డాక్టర్ శ్రీజన్ లు సమర్థవంతంగా నిర్వహించారు.



