ఈ బాలికలు బాల్య వివాహాలపై పోరాడుతున్నారు. అకాల గర్భాలతో ప్రాణాలు కోల్పోతున్న గ్రామీణ అమ్మాయిలకు కొత్త జీవితం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. పునరుత్పత్తి హక్కులు తమవే అంటున్నారు. దీనికోసం పని చేసే ఏక్తా కిషోరి సమూహ్లో భాగస్వాములయ్యారు. దీని చొరవతో నాయకులుగా ఎదిగిన ఈ యూత్ ఛాంపియన్స్ ఋతు పరిశుభ్రతతో పాటు యుక్తవయసులో వారికి అవసరమైన ఆరోగ్య సేవలను పొందడం వంటి కీలక సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆ వివరాలు నేటి మానవిలో…
బీహార్ రాష్ట్రం, దర్భాంగా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 18 ఏండ్ల సానియా కుమారి అక్కడి యువ నాయకత్వ ఉద్యమంలో భాగమయ్యింది. ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆ యువ సమూహం 2017లో ఆమెకు పరిచయమైంది. ఇప్పుడు ఆమె సమాజంలోని వందలాది మంది బాలికల జీవితాలను మార్చిన నాయకత్వ ప్రయాణంగా పరిణామం చెందింది. 2020 నాటికి సానియా ‘ఏక్తా కిషోరి సమూహ్’ అనే బాలికల సమూహానికి నాయకత్వం వహిస్తోంది. గ్రామంలోని బాలికలకు సురక్షితమైన ఋతు పరిశుభ్రత ఉత్పత్తులను అందించడానికి శానిటరీ ప్యాడ్ బ్యాంకును ప్రారంభించింది. వారిలో చాలా మంది వీటిని ఎప్పుడూ వాడలేదు. ఏక్తా కిషోరి సమూహ్ కార్యక్రమం కింద లింగ సమానత్వం, ఆరోగ్యం, అభివృద్ధి విధానాలను ప్రోత్సహించడానికి అంకితమైన ఓ ఎన్జీఓ. ఇది పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మార్గనిర్దేశంలో నడిచే సంస్థ. ఇందులోని 80 మంది యూత్ ఛాంపియన్లలో సానియా ఒకరు.
కిషోరి సమూహ్
2015 నుండి బీహార్లోని నవాడా, దర్భంగా జిల్లాల్లో పీఎఫ్ఐ లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య అవగాహనతో పాటు వారి హక్కులపై దృష్టి పెట్టింది. కిషోరి సమూహ్లలో సభ్యులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ ఛాంపియన్లలో చాలామంది ఇప్పుడు నాయకులుగా ఎదిగారు. మొదటి కిషోరి సమూహ్ సమావేశానికి వెళ్ళినప్పుడు సానియాకు 11 ఏండ్లు. ‘చాలా కుటుంబాలు తమ అమ్మాయిలను ఈ సమావేశాలకు పంపించేందుకు ఇష్టపడడం లేదు’ అని ఆమె చెప్పింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఆమెలో మరింత పెరిగింది. దీనిపై మరింత అధ్యయనం చేసింది. ‘అందరూ అత్యంత రహస్యంగా భావించే పీరియడ్స్, ఋతు ఆరోగ్యం గురించి మాట్లాడటానికి బదులుగా పాఠశాలలో అమ్మాయిల అనుభవాల గురించి, వారి కలల గురించి అడగడం ప్రారంభించారు. అమ్మాయిలు ఇందులోకి రావాలంటే ముందుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అందుకే తల్లిదండ్రులతో సెషన్లు ప్రారంభించారు’ అని సానియా పంచుకుంది.
అసలు చర్చే ఉండదు
బీహార్ గ్రామీణ ప్రాంతంలోని అనేక ప్రాంతాలలో ఋతుస్రావం నిషేదించిన పదం. బాలికలకు వారి ఋతు చక్రాల గురించి కనీసం ప్రాథమిక అవగాహనే లేదు. ఇంట్లోగానీ, పాఠశాలలోగానీ దీనిపై అసలు చర్చే జరగదు. ‘పాత వస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు, దాన్ని ఎండలో కూడా ఆరబెట్టరు. ఎందుకంటే దీన్ని మగవాళ్లు చూడకూడదని వారి భావన. ఋతుస్రావం ప్రారంభమైన అమ్మాయిని మూఢనమ్మకాలతో ఓ అంటరాని మనిషిగా చూస్తున్నారు’ అని సానియా అంటుంది. పీఎఫ్ఐ ప్రారంభించిన విజయవంతమైన కార్యక్రమాలలో ‘ప్యాడ్ బ్యాంక్’ అత్యంత ముఖ్యమైనది. దీని తర్వాత అమ్మాయిలు బయటకు వచ్చి ఈ బృందంతో కలిసి పని చేయడం ప్రారంభించారు.
ఋతు పరిశుభ్రతపై…
ఎన్నో వర్క్షాప్ల తర్వాత యూత్ ఛాంపియన్లు అవసరమైన సామర్థ్యం పొందారు. ఈ యువ నాయకులు 204 కిషోరి క్లబ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 10 నుండి 15 మంది బాలికలకు ఆరోగ్యం, భవిష్యత్తు గురించి అవగాహన కల్పిస్తుంది. గ్రామీణ భారతంలో అత్యంత ముఖ్యమైన, నిర్లక్ష్యం చేయబడిన సమస్యలలో ఒకటైన రుతు పరిశుభ్రత అనేది యువ నాయకులకు ప్రాధాన్యతగా ఉద్భవించింది. NFHS-5 ప్రకారం బీహార్లో కేవలం 58% మంది బాలికలు మాత్రమే పరిశుభ్రమైన రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. నవాడా, దర్భాంగా వరుసగా 57% నుండి 65% వెనుకబడి ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకే 52 శానిటరీ ప్యాడ్ బ్యాంకులను ప్రారంభించారు. ఇవి కమ్యూనిటీ నిర్వహణలో ఉన్న బ్యాంకులు. ఇక్కడ బాలికలు రోజుకు రూ.1 చొప్పున సమిష్టిగా ప్యాడ్లను కొనుగోలు చేసి, కొనుగోలు చేయలేని వారికి పంపిణీ చేస్తారు. ప్యాడ్ బ్యాంక్ ఆలోచన ఆ బాలికల నుండే వచ్చింది.
ఆమె జోక్యం తర్వాత…
ఈ కార్యక్రమం సంస్థాగత మార్పుకు కూడా దారితీసింది. 2018లో బీహార్లోని మరొక గ్రామమైన హార్దియాకు చెందిన యూత్ ఛాంపియన్ మౌసమ్ కుమారి, రాజౌలి సబ్-డివిజనల్ హాస్పిటల్లో జరిగిన జన్ సంవాద్ (సామాజిక ఆడిట్) సందర్భంగా కౌమార ఆరోగ్య సేవల కొరత సమస్యను లేవనెత్తింది. ఆమె జోక్యం తర్వాత శిక్షణ పొందిన సహాయక నర్సు మిడ్వైఫ్తో కూడిన ఒక కౌమార ఆరోగ్య కార్నర్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దర్భంగాకు చెందిన ఆర్తి కుమారి ఒక కమ్యూనిటీ సర్వే నిర్వహించింది. ఇది 6,000 కంటే ఎక్కువ మంది వద్దకు చేరుకుంది. ఆమె ప్రయత్నం యువతులకు ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా స్నేహపూర్వక క్లినిక్లను స్థాపించబడ్డాయి.
కుటుంబాలతో పోరాటం
యూత్ ఛాంపియన్లు గ్రామ ఆరోగ్య కమిటీలలో కూడా సభ్యులుగా ఉంటారు. ఇక్కడ వారు కౌమార ఆరోగ్య సేవలను పర్యవేక్షించడంలో సహాయం చేస్తారు. ఈ కార్యక్రమ ప్రభావంSRHR మించి విస్తరించింది. కోవిడ్-19 సమయంలో యూత్ ఛాంపియన్స్ వ్యాక్సిన్లు వేయించడంతో పాటు మాస్క్లు పంపిణీ చేశారు. స్థానిక ఆరోగ్య విభాగాలకు మద్దతు ఇచ్చారు. కొన్నేండ్లలోనే యూత్ ఛాంపియన్స్ నవాడాలోని కవాకోల్, రాజౌలి బ్లాక్లలో, దర్భంగాలోని బహేరి, సింఘ్వారా బ్లాక్లలో 90కి పైగా బాల్య వివాహ కేసులను ఆపగలిగారు. దీని కోసం వారు కుటుంబాలతో పోరాడతారు, స్థానిక పంచాయతీలను అప్రమత్తం చేస్తారు, అవసరమైనప్పుడు పోలీసులను ఆశ్రయిస్తారు. పరిస్థితులు మరింత తీవ్రమైనప్పుడు ఎన్జీఓ సహకారం తీసుకుంటారు.
స్నేహితులను కోల్పోయారు
వీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల చాలా మంది అమ్మాయిలు అవమానాలకు గురయ్యారు. సానియాతో పాటు ఆమె బృందం వారి కుటుంబాల నుండి విమర్శలను ఎదుర్కొంది. అయినా పట్టువదల కుండా ప్రయత్నం కొనసాగించారు. ‘గతంలో అకాల గర్భధారణ వల్ల చాలా మంది స్నేహితులను కోల్పో యాము. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. ఇప్పుడు చాలా మంది కాలేజీలకు వెళుతున్నారు. ఇప్పుడు మేము పురుషుల లైంగిక ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుతున్నాము. అయితే చాలా మంది విమర్శిస్తున్నారు. అయినా వారికి సాధ్యమైనంత వరకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ సానియా పంచుకుంది.
మన యూత్ ఛాంపియన్స్
- Advertisement -
- Advertisement -