గుర్తించిన బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా
లండన్ : బ్రిటన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. పాలస్తీనా ను అధికారికంగా దేశంగా గుర్తించింది. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని ప్రకటించారు. పాలస్తీనీయులు, ఇజ్రాయిల్ పౌరుల్లో శాంతిస్థాపన ఆశలను పునరుద్ధరించేందుకు, ద్విదేశ పరిష్కారం కోసం ఈమేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కెనడా, ఆస్ట్రేలియాలు సైతం ఈమేరకు ప్రకటన చేశాయి. గాజాలో కాల్పుల విరమణకు, ఐరాస సాయం అనుమతికి, దీర్ఘకాలిక శాంతికి ఇజ్రాయిల్ అంగీకరించకపోతే.. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తా మని జులైలోనే స్టార్మర్ ప్రకటించారు. ఇటీవల బ్రిటన్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్టార్మర్ ప్రభుత్వ ప్రణాళిక లను వ్యతిరేకించారు. ఈ విషయంలో ప్రధాని స్టార్మర్ తో విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 140కి పైగా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. త్వరలోనే ఫ్రాన్స్ తదితర దేశాలూ ఈమేరకు ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం.
ఏమిటీ ద్విదేశ పరిష్కారం
పాలస్తీనాను దేశంగా గుర్తించే విషయంలో బ్రిటన్ తదితర దేశాల ప్రణాళికలను అమెరికా, ఇజ్రాయిల్ దేశాల ప్రతినిధులు ఇప్పటికే ఖండించారు. ఉగ్రవాదంతోపాటు 2023 అక్టోబరు 7నాటి దాడుల విషయంలో హమాస్కు బ్రిటన్ బహుమతి ఇచ్చినట్టు ఇజ్రాయిల్ విదేశాంగశాఖ విమర్శించింది.
ఇజ్రాయిల్ దాడుల్లో 55 మంది మృతి
ఆదివారం ఉదయం నుంచి గాజాపై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో 55 మంది పాలస్తీయన్లు మరణించారు. గాజా నగరంలోనే 37 మంది చనిపోయినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. మరోవైపు ఆకలికోరల్లో చిక్కి మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆకలితో చనిపోయిన వారి సంఖ్య మరింతగా అధికమవుతోంది. దీనిపై పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తరచేస్తున్నాయి.