నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజైన గురువారం ప్రారంభమైన కొద్దిసేపటికే నిరవధిక వాయిదా పడింది. మొదటిసారి లోక్ సభలో వందేమాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం సభను వాయిదావేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. నేటి సభకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలు ఇద్దరూ హాజరయ్యారు. నేటితో ముగియనున్న వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరగలేదు. ప్రశ్నోత్తరాల స మయం జరగలేదు. ఎటువంటి చర్చ జరపకుండానే కేంద్రం పలు బిల్లులను ఆమోదించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా చేపట్టిన విద్యార్థుల ఆందోళనపై పోలీసుల చర్యకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమివ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నీట్పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర చర్చకు సిద్ధమని బుధవారం అమిత్షా పార్లమెంటులో మీడియాతో పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చకు సమయాన్ని పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే నిరసనకారులపై కాల్పులు, పోలీసుల దాడికి ఎవరు ఆదేశాలిచ్చారనే దానిపై యువతకు సమాధానం కావాలని, అమిత్షా ఇచ్చే ప్రసంగం కాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చ ప్రతిపాదనను తిరస్కరించారు.
‘గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం’కు సవరణలు చేసే బిల్లును లోక్సభ బుధవారం ఎటువంటి చర్చా లేకుండానే ఆమోదించింది. రాజ్యసభ మరో రెండు బిల్లులను ‘జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు, 2026’ ‘కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026’ను ఆమోదించింది.



