నవతెలంగాణ – భిక్కనూర్
భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటివల కాలంలో జరిగిన దొంగతనం కేసు చేధించిన వివరాలు ఎఎస్పి చైతన్య రెడ్డి వివరాలు మీడియాకు తెలియజేశారు. ఎఎస్పి తెలిపిన వివరాల ప్రకారం రామేశ్వరపల్లి గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం, భిక్నూర్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన హుండీ చోరీ కేసులను పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు తమ నేరాలను ఒప్పుకున్నారు. మొదటి నిందితురాలు లంబాడీ శ్రావణి (21), సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందినది.
ఆమె తన భర్త శ్రీనివాస్, గణేష్లతో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపింది. రామేశ్వరపల్లి గ్రామంలో ఒక ఇంటిలో చోరీ చేసి వెండి పట్టిగొలుసులు, బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు తెలిపారు. భిక్నూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు దొంగిలించినట్లు తెలిపారు. రెండవ నిందితుడు పర్ధం ఏలియా ప్రవీణ్ (26), నర్సాపూర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి. అతను దొంగ సొత్తు అని తెలిసినా ఆభరణాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. నిందితుల వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు, వెండి పట్టిగొలుసులు, ద్విచక్ర వాహానాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను ఎఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



