– డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని ఆపాలనీ, నిరుద్యోగ యువతను అరెస్టు చేసి వారిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తి వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటా రమేష్, ఆనగంటి వెంకటేష్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నియమకాలకై నోటిఫికేషన్స్ ఇవ్వాలని మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ లో ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ”రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలి. ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ, దాని కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనీ, యూపీఎస్సీ తరహా ఉద్యోగ నియామకాల పక్రియ చేపడతామని ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఏర్పడుతున్న అందుకు అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తున్నది… ” అని వారు విమర్శించారు. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు ఇచ్చిందే తప్ప కొత్త ఉద్యోగాలు అదనంగా వేయలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ అంశంపై సమగ్రంగా చర్చించి నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీని ఇవ్వా లనీ, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం పోరాడే వారిపై పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని కోరారు. లేనియెడల రాష్ట్రంలో జరిగే పరిణామా లకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.
నిరుద్యోగ యువతపై పోలీసుల నిర్బంధం ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



