నవతెలంగాణ – ముధోల్
రైతులు భూ వివాదాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని బైంసా సివిల్ కోర్ట్ జడ్జి ఆర్కే వెంకటరమణ సుహాస్ అన్నారు. ముధోల్ మండలంలోని తరోడ గ్రామ రైతు వేదికలో రోజు బుధవారం మండల న్యాయా సేవా సంస్థ భైంసా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు ఏదన్నా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా చట్టబద్ధంగా డాక్యుమెంటేషన్ చేయించుకోవాలన్నారు.
తప్పనిసరిగా భూములకు సంబంధించిన రికార్డులు పరిశీలించిన, అనంతరం కొనుగోలు చేయాలన్నారు. రైతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సమస్యలు తలెత్తినప్పుడు పేదవారు న్యాయ విజ్ఞాన సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చు అన్నారు. చిన్నపాటి గొడవలను, పెద్దది కాకుండా రాజీ మార్గంలోని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల హక్కులు, చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బిట్ల పెర్సిస్, ఏవో రచన, సర్పంచ్ అరిపోద్దిన్ , ఉపసర్పంచ్ హనుమంతరావు పటేల్, ఎఈఓ పుప్పల భూమేష్ ,తదితరులు పాల్గొన్నారు.



