నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో సిద్ధం చేస్తున్న గుంతలను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేయాలన్నారు. గ్రామానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలు తీయించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. గుంతల్ని నిర్దేశించిన దూరంలో వరుస క్రమంలో తీయాలని, ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం ఉన్నచోట గుంతలు తీయించొద్దని స్పష్టం చేశారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సమయం దగ్గర పడుతున్నందున గుంతలు తీయించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఇందుకోసం ఉపాధి కూలీలందరినీ వినియోగించుకోవాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమా, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, తదితరులు పాల్గొన్నారు