ఈ పండుగ శాంతి, పరస్పర సామరస్యమనే సందేశాన్ని ఇస్తుంది : ద్రౌపది ముర్ము
సోదరభావం, దయ మరింత పెంపొందాలి : మోడీ
న్యూఢిల్లీ : రంజాన్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటున్న ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోడీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు సోదరభావం, దయ వెల్లివిరవాలని ఆకాంక్షించారు. ”ఈద్ ఉల్-ఫితర్ శుభాకాంక్షలు. ఈరోజు నలువైపులా సోదరభావం, దయ మరింత పెంపొందాలి. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈద్ ముబారక్” అని మోడీ ఎక్స్ పోస్టులో శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడానికి, దేశ పురోగతికి దోహదపడటానికి అందరూ సంకల్పం తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పిలుపునిచ్చారు. ”పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత జరుపుకునే ఈ పండుగ ఆత్మనిగ్రహం, దానధర్మాలు, నిరుపేదల పట్ల కరుణ అనే సందేశాన్ని ఇస్తుంది. అలాగే ఇది ప్రేమ, సోదరభావం, శాంతి, పరస్పర సామరస్యం అనే సందేశాన్ని కూడా తెలియజేస్తుంది” అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ”మీకు, మీ ప్రియమైన వారికి ఆనందం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను” అని సోషల్మీడియాలో వీడియో పోస్టు ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ఈ పవిత్ర మాసంలో పెంపొందించుకున్న కరుణ, ఉదారత, ఐక్యత వంటి విలువలను వేడుకగా జరుపుకునే సందర్భమని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. తాము ముస్లింలకు ఎప్పుడూ అండగా నిలుస్తామని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్లాం ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చినప్పుడల్లా, మేము ప్రజా వేదికలోనూ పార్లమెంటులోనూ వాటికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నామని స్టాలిన్ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి శనివారం ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛ వారికి దక్కాలని ఆకాంక్షించారు.
రాష్ట్రపతి, ప్రధాని రంజాన్ శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -



