– ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట
– కళాశాలలోకి వెళ్లేందుకు యత్నం
– అడ్డుకున్న పోలీసులు
– సమగ్ర విచారణ జరపాలి : బాబూరావు
విజయవాడ : విజయవాడ శాతవాహన కళాశాల భవనాలను కూల్చివేసి, ఆ స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రమించడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఐ(ఎం) తలపెట్టిన ధర్నా కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ కశాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, కళాశాల పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు… పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాటలు, పెనుగులాటలు జరిగాయి. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రశాంతంగా నిరసన తెలిపిన అనంతరం…కళాశాల శిధిలాలను పరిశీలించడానికి నలుగురిని లోపలికి అనుమతించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్ తదితరులు గవర్నర్పేట సీఐ అడపా నాగమురళీని కోరారు. అందుకు సిఐ అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఒకరిద్దరు ఆందోళనకారులు కళాశాల గోడదూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ‘ఈ భూమి మాది’ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేసి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాతవాహన కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని, కబ్జాకోరుల నుంచి కళాశాల భూమిని కాపాడాలని, కబ్జాకారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు డౌన్డౌన్ అంటూ ఆందోళనకారులు చేసిన నినాదాలు హోరెత్తాయి. మహిళలు, విద్యార్ధులు, యువత పెద్దఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ… ఎంతో ఘన చరిత్ర కలిగిన విజయవాడ శాతవాహన కళాశాలను కొందరు కోర్టు తీర్పుల పేరుతో అడ్డగోలుగా కబ్జా చేస్తుంటే ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల అండతోనే కబ్జాకారులు రాత్రికి రాత్రే రెచ్చిపోయారన్నారు. విజయవాడ నగర చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ చూడలేదన్నారు. బుల్డోజర్ సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కూల్చివేసిన శిథిలాలను చూడటానికి కూడా పోలీసులు అనుమతించకపోవడం చూస్తే… ప్రభుత్వం ఎవరికి అండగా ఉందో అర్థమవుతోందన్నారు. ఇది అర్బన్ సీలింగ్ భూమి అని, కళాశాల యజమానులకు సంబంధం లేదని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, కబ్జాకోరుల నుంచి కళాశాల భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, పశ్చిమ, సెంట్రల్, తూర్పు సిటీ కమిటీ కార్యదర్శులు బోయి సత్యబాబు, భూపతి రమణారావు, పి.కృష్ణ దితరులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విజయవాడ శాతవాహన కళాశాలను కూల్చివేసిన ఘటనపై విచారణ చేసి, కబ్జా కోరులపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆక్రమణలకు, కబ్జాలకు గురౌతున్న ప్రభుత్వ విద్యాలయాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శాతవాహన కళాశాలకూల్చివేతపై నిరసన
- Advertisement -
- Advertisement -