Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌

- Advertisement -

ఆరుగురు మావోయిస్టులు మృతి
ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
నారాయణ్‌పూర్‌లోని అబూజ్‌మఢ్‌ అటవీప్రాంతంలో ఘటన
నవతెలంగాణ-చర్ల

ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని రోజుల పాటు నిశబ్దంగా ఉన్న అడవుల్లో తుపాకుల మోత వినబడింది. ఇక్కడ మళ్లీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. నాయయణ్‌ పూర్‌ జిల్లాలోని అబూజ్‌మఢ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెప్పారు. వారి నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం.. మావోయిస్టు క్యాడర్‌ దాగి ఉన్నదన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్‌ను చేపట్టాయి. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌సీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌), ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. చనిపోయిన మావోయిస్టులు ఎవరు, వారిటి వివరాలు ఏమిటి అనేది గుర్తించాల్సి ఉన్నది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. ఇందులో ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌ వంటివి ఉన్నాయని తెలిపారు. భద్రతా దళాల వ్యూహాత్మక, రక్షణ చర్యల్లో భాగంగా తదుపరి ఆపరేషన్‌ వివరాలను వెల్లడించలేమని బస్తర్‌ రేంజ్‌ పోలీస్‌ ఐజీ సుందర్రాజ్‌ పి చెప్పారు. దేశంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌పై ప్రత్యేక దృష్టిని సారించింది. దీంతో గత కొన్ని నెలలుగా ఇక్కడ వరుస ఎన్‌కౌంటర్‌లు చోటు చేసుకుంటున్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీ కీలక నేతలతో పాటు పెద్ద ఎత్తున సభ్యులు ఈ ఎన్‌కౌంటర్‌లలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రం తీవ్రం చేయటంతో మావోయిస్టులు చిన్న చిన్న యూనిట్లుగా ఏర్పడి, ఎవరూ ప్రవేశించటానికి వీలులేని ప్రాంతాలకు తరలుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు మహారాష్ట్రలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసం దాదాపు 20 వేల మంది సిబ్బందితో కూడిన భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. గతేడాది దేశంలో మొత్తం 217 మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఆ సంఖ్య ఈ ఏడాది అర్ధభాగానికి 460కు పెరిగటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -