నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో 27 గ్రామపంచాయతీలు, 222 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 15,171, మహిళా ఓటర్లు 15,705గా ఉన్నారని, మొత్తం ఓటర్లు 30,876 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు బుధవారం ఏడు మండలాల్లో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పురుష ఓటర్లు 1,00,249, మహిళా ఓటర్లు 1,01,184, ఇతరులు 4 మంది కలిపి మొత్తం 2,01,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.
చివరి మూడో విడత ఎన్నికల నిర్వహణ కోసం 21 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు 23 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టరేట్తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచే నేరుగా వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.



