బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరిగిందని వెల్లడించడం సంచలనం కలిగించింది. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో లోపాలోపాల గురించి, పార్టీ రాజకీయ విధానం గురించీ తన అభిప్రాయాలు చెప్పడానికి అధ్యక్షుడు కేసీఆర్కు రాసిన లేఖ లీక్ చేశారంటూ కవిత బహిరంగంగానే తిరుగుబాటు ప్రకటించారు. ఆ క్రమంలో లేఖలో రాసిన దాన్ని మించి సంచలన విషయాలు చెప్పి షాక్ ఇచ్చారు. బీజేపీతో విలీనానికి పార్టీలో కీలక వ్యక్తులు కుట్ర పన్నారనే ఆరోపణ వాటిలో అతి తీవ్రమైంది. లిక్కర్ కుంభకోణంలో తాను జైలులో ఉన్నప్పుడే ఈ విషయం దృష్టికి వచ్చిందని, తను అడ్డుకున్నానని ఆమె చెబుతున్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్, బీజేపీపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకపోవడం, రెండు నిముషాలు మాత్రమే దానిపై చెప్పి కాంగ్రెస్ ఏకైక విలన్ అని ప్రకటించడం ముందే సందేహాలు పెంచింది. మునుగోడు ఉపఎన్నికకు ముందు బీజేపీ మత రాజకీయాల పైన, మోడీ నిరంకుశత్వం పైన నిప్పులు జరిగిన కేసీఆర్ ఎందుకు ఇంతగా మారిపోయారు? ఎన్నికల ముందు కనిపించిన ఈ మార్పు ఓటమి తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒక స్థానం కూడా తెచ్చుకోకపోగా బీజేపీ 8 సీట్లు తెచ్చుకోగలిగింది. తమ ఓట్లను బదలాయించడం వల్లనే బీజేపీకి సహకరించారనే ఆరోపణను ఎదుర్కొన్నది. శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీతో బీఆర్ఎస్ పోటీ పడకపోవడం బీజేపీకి మేలు చేసింది. ఈ పూర్వరంగంలో కేసీఆర్ రజతోత్సవ సభలో బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందని కవిత విమర్శిం చారు. ఈ అంశం పార్టీ అధినేత దృష్టికి తీసుకురావడానికి తాను రాసిన అంతర్గత లేఖను లీవ్ చేయడం కూడా కుట్రలో భాగమని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ దేవుడేనని కానీ చుట్టూ దయాలున్నాయని తీవ్రభాషలో మాట్లాడారు.
దేవుడూ, దయ్యాలూ
కవిత వ్యాఖ్యలు కొత్త ప్రశ్నలు తీసుకువచ్చాయి . దేవుడైన కేసీఆర్ దయ్యాలను ఎందుకు చుట్టు పెట్టుకున్నారు? ఆ దయ్యాలు దేవుడు కంటే శక్తివంతమైనవా? ఇంతకు ఎవరు ఆ దయ్యాలు? బీఆర్ఎస్ ప్రధమ కుటుంబ సన్నిహితులైతే కవిత దాడి యావత్తు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అన్న కేటీఆర్పైనే ఉద్దేశం ఎక్కువ పెట్టబడిందని స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్రావుల మధ్య వైరుధ్యాల గురించి చాలా ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవానికి అన్నాచెల్లెళ్ల మధ్య ఎక్కువ వైరుధ్యం ఉంటుందని, ఉందని ఎప్పుడూ వింటున్న మాటే. ఏదైనా కుటుంబం ప్రాబల్యం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటివి సర్వసాధారణం. కవితను కేసుల నుంచి కాపాడుకోవడానికి కేసీఆర్ బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారని ఒక దశలో చాలామంది అభిప్రాయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆమే ఆ అంశాన్ని ప్రశ్నించటం కొత్త మలుపునకు దారి తీసింది. అయితే కవిత మాటలు చేతలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నడిచింది ఈ మధ్య కాలంలో పెద్దగా చూడలేదు. ఇప్పుడు కూడా బీజేపీతో కలిస్తే లిక్కర్ వ్యవహారంలో తను దోషినని ఒప్పుకున్నట్టు అవుతుందని ఆమె వాదన చేస్తున్నారు. రాజకీయంగా దాని మతతత్వం, కేంద్ర నిరంకుశత్వం, తెలంగాణకు అన్యాయం వంటి అంశాలు ప్రధానంగా ముందుకు తేవడం లేదు. లేఖ లీక్్ తర్వాత కూడా బీజేపీ విధానాలపై పాలనపై ఆమె పెద్దగా విమర్శిం చింది లేదు. ఆపరేషన్ కగార్ను కేసీఆర్ వ్యతిరేకించటం గొప్ప ప్రజాస్వామిక చర్య గనుక ఆ పేరుతో ఆయన తప్పిదాలను పక్కనపెట్టి మళ్లీ బీఆర్ఎస్ను బలోపేతం చేద్దాం అన్నది. గత కొంతమంది మద్దతు దారుల, మేధావి వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన, ఎన్కౌంటర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ముద్దాయిగానే ఉంది. పైగా మొన్నటి సభలో ఆయన కేంద్రాన్నిగానీ, హోం మంత్రి అమిత్షాను కానీ ప్రత్యేకించి ప్రస్తావించింది లేదు. అటువంటప్పుడు ఈ ఒక్క అంశం ఆధారంగా తీసుకొని కేసీఆర్కు బీఆర్ఎస్కు వంత పాడటం సరైనదే అవుతుందా? ఇప్పుడు కవిత కూడా కగార్ కేంద్రం బాధ్యత అంటున్నారు కానీ ఇతర అంశాలు ఇప్పటివరకు ప్రస్తావించలేదు. సామాజిక న్యాయం అన్న నినాదంతో ఆమె ఈ ప్రత్యేక ప్రయాణం ప్రారంభించినట్లు కనిపిస్తుంది. కగారు పేరుతో కేసీఆర్ను బలపరిచినట్టే సామాజిక న్యాయం అంటున్నారు కనుక కవితను బలపరచాలని ఒక వర్గం వాదనగా ఉంది. మొదట ఆమె తెలంగాణలో చాలా ఏండ్లుగా సామాజిక న్యాయం జరగలేదని అన్నప్పుడు కేసీఆర్ను కూడా విమర్శించినట్టు వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఆయనను మినహాయిస్తున్నట్లు ఆమె చూచాయగా తర్వాత మాట్లాడారు. మరోవైపు ఈ నినాదంతో ఆమె కొంతమంది రాజకీయ పార్టీల నేతలను కూడా కలిసి సహాయం అభ్యర్థించారు. ఈ అంశాలు సరైనవైనా మొత్తం రాజకీయ విధానం కవిత అంతర్గత కుటుంబ వివాదం ఏమైనప్పటికీ రాజకీయంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనేది ఆచరణలో చూడాలి. ఇప్పటికైతే తాను వేరే పార్టీ పెట్టడం లేదని కేసీఆర్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ను కాపాడుకోవడమే ముఖ్యమని ఆమె చెబుతున్నారు. ఏమైనా ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ వివరణ ఇవ్వవలసి ఉంటుంది.
విశ్వసనీయతకు విఘాతం
కేసీఆర్ ఆదేశిస్తే కేటీఆర్ నాయకత్వానికి పని చేస్తానని హరీశ్రావు ఈమధ్య చెప్పడంతో కొంతకాలం చర్చ సాగింది. అదే సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఘనంగా రాజకీయ జీవితం విరమించాలని హరీశ్రావు అంతర్గత సమావేశంలో చెప్పినట్టు కేసీఆర్ సన్నిహితులు బహిరంగంగానే ప్రకటించారు. రజతోత్సవ సభలో హరీశ్రావును దూరం పెట్టడం, కవితకు ప్రాధాన్యత లేకపోవడం రాజకీయ కారణాల వల్లే జరిగిందని కూడా ఇప్పుడు అర్థమవుతుంది.. అంతర్గతంగా ఈ మల్ల గుల్లాలు బీఆర్ఎస్ అధినేత ఎలా ముగిస్తారు అన్నది ఆయన తీసుకునే రాజకీయ వైఖరి ద్వారానే తేలుతుంది. ఇంత వివాదం తర్వాత కూడా కేసీఆర్ గనక బీజేపీ పట్ల మెతక వైఖరితో ఇతరులపైనే దాడి కొనసాగించేట్లయితే అప్పుడు విశ్వసనీయత కోల్పోవడం అనివార్యమవుతుంది. కవిత బీజేపీతో చెలిమి వద్దంటున్నప్పటికీ ఈ వివాదం ద్వారా బీఆర్ఎస్ను బలపరచడం, బలహీనపరచడం వారికే మేలు చేస్తుందన్న వ్యాఖ్య కూడా వినిపిస్తోంది/ ప్రస్తుతానికి కేటీఆర్ చొరవకు పగ్గాలు తప్పనిసరి అనిపిస్తుంది కావచ్చు. హరీశ్రావు వరకు కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు గురించి ఎక్కువగా చర్చలు చేస్తున్నారని సమాచారం. కవితకు ప్రోద్బలం కాంగ్రెస్ నుంచి వచ్చిందని ఒక పత్రిక ఇచ్చిన కథనాలను ఆమె ఖండిస్తున్నా ఆ పార్టీ మాత్రం ఈ వివాదాన్ని వినోదంగా ఆస్వాదిస్తున్నది. అలాగే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ విషయంలో అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు, చెబుతున్న జోస్యాలు కూడా వివాదాస్పదమయ్యాయి. టీ బీజేపీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉత్తమ పార్టీ వారు అతిగా స్పందించవద్దని హెచ్చరించాల్సి వచ్చింది. నిజానికి బీజేపీలో కూడా అంతర్గత ఐక్యత పెద్దగా లేదు. తమ పార్టీ వారు కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేతులు కలిపారని గతంలో ఆరోపించిన వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ విలీనం ప్రయత్నాలు కూడా తోసిపుచ్చలేనని సందేహం ప్రకటించారు. గతంలో కాంగ్రెస్తో విలీనం అవుతామని ఆశపెట్టి ఆఖరిలో అడ్డం తిరిగిన కేసీఆర్ను నమ్మవద్దని అటు బీజేపీ నాయకులు చెప్తుంటే.. ఆ పార్టీతో కలిసిన వారెవరు బాగుపడలేదని కవిత తన తండ్రిని హెచ్చరిస్తున్నారు. వేరే పార్టీ యోచన లేదని కవిత పదేపదే చెప్పడం కూడా దీన్నే బలపరుస్తున్నది. అసలు ఇదంతా టీ కప్పులో తుపాను వంటిదేనని తమ వైఫల్యాలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అంతర్గత విభేదాలను అతిగా ముందుకు తేవడం కేసీఆర్కు అలవాటైన ఎత్తుగడ అని కొందరు విమర్శకులు మాట. కానీ ఈ కథ ఇంత దూరం రావడం వెనక బీజేపీ అదృశ్యహస్తం ఏ మేరకు పనిచేస్తున్నది?
కడప కథా అదేనా?
ఇదే ఏపీలో మరో రూపంలో కనిపిస్తున్నది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి మహానాడు కడపలో ముగిసింది. 43 ఏండ్ల తెలుగుదేశం, నాలుగో దఫా పాలన తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు భవిష్యత్ రాజ కీయ గమనం ఎలా ఉంటుందనేది అందరి దష్టిలో కీలకంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభు త్వంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీలతో కలిసి అధికారం పంచుకుంటున్నందున రాజకీయ పొందికల గురించి ఏం చెప్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. అట్టహాసాలు, ఆర్భాటాలుచాలా ఉన్నా ఈ అన్ని విషయాల్లోనూ అస్పష్టతనే మిగిలిస్తూ మహానాడు ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి గాని. తెలుగు దేశం అంతర్గత వ్యవహారాలకు సంబంధించి గాని నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా చెప్పింది దాదాపు లేదు.
చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు పెద్దమ్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మధ్యవర్తిత్వంతో లోకేష్ నేరుగా హోం మంత్రి అమిత్షా తో మంతనాలు జరిపారు. అప్పుడే టీడీపీ పూర్తిగా బీజేపీతో లంకె వేసుకుంది. మహానాడుకు ముందు , సకుటుంబం లోకేష్ మోడీని కలుసుకొని రావటం, తర్వాత చంద్రబాబు భేటీ ఇందులో భాగమే. టీడీపీలో సూపర్ సీనియర్లను నమస్కార బాణం వేసి మొత్తం సారథ్యం అంటే లోకేష్ బందానికి అప్పగించటం వెనుక నేపథ్యం ఇది. బీజీపీ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన జపం చేస్తుంటే లోకేష్ కూడా టీడీపీని అదే బాటలో వేగంగా నడిపించడం కొత్త పరిణామం. అందుకే మొత్తం మహానాడులో ఎక్కడ లౌకికతత్వం, మతసామరస్యాన్ని కాపాడుకోవడం వంటి మాటలే వినిపించలేదు. ఆ పార్టీ రాజకీయ తీర్మానంలో కూడా ఆ పదాలు లేవు. అమరావతికి కేంద్రం సహకరించాలని విభజన చట్టంలో ఉన్నది. కానీ మోడీ సర్కారు ప్రపంచ బ్యాంకు అప్పు ఇప్పించటమే ఘనతగా చెప్పడం తప్ప ఆ హామీ అమలు చేయమని అడిగే ఆలోచన కూడా లేకపోయింది.. ఏపీలో వైసీపీ టీడీపీ, జనసేన, తెలంగాణలో బీఆర్ఎస్ నాలుగు ప్రాంతీయ పార్టీలు బీజేపీ ముందు గప్ చిప్ కావడమే ఇక్కడ ఉమ్మడి అంశం. కడపలో విన్యాసాలు, కవిత లేఖ లీక్లూ షాక్లూ ఈ మొత్తం వ్యవహారంలో తాజా ట్విస్ట్ మాత్రమే.
– తెలకపల్లి రవి