Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయంప్రముఖ చరిత్రకారుడు కె.ఎన్‌.ఫణిక్కర్‌ కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు కె.ఎన్‌.ఫణిక్కర్‌ కన్నుమూత

- Advertisement -

తిరువంతనపురం : ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త, ప్రజా మేధావి కె.ఎన్‌.ఫణిక్కర్‌ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 89 ఏండ్లు. తిరువనంతపురంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో వయోజన సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతూ ఫణిక్కర్‌ కన్నుమూశారు. వచ్చే నెల (ఏప్రిల్‌) 26న ఫణిక్కర్‌్‌ 90వ జన్మదినాన్ని ప్రత్యేక కార్యక్రమాలతో నిర్వహించడానికి కేరళ చారిత్రక పరిశోధన మండలి (కేసీహెచ్‌ఆర్‌) సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం సంభవించింది. దేశ చరిత్ర ముఖ్యంగా ఆధునిక భారత దేశ చరిత్రలో ప్రముఖ పండితుల్లో ఒకరిగా ఫణిక్కర్‌ను పరిగణిస్తారు. అలాగే, లౌకిక, విమర్శనాత్మక చరిత్ర పరిరక్షకుడిగానూ ఫణిక్కర్‌ పేరుగడించారు. అదేవిధంగా పదునైన ఆధారాలతో చారిత్రక రచనకు, సామూహిక వివరణలకు ఫణిక్కర్‌ ప్రసిద్ధి పొందారు. చరిత్ర రచన ఎల్లప్పుడూ మేథోపరమైన సమగ్రత, సైద్ధాంతిక వక్రీకరణలు లేకుండా ఉండాలనే నిబద్ధతకు పనిక్కర్‌ చివరకూ కట్టుబడ్డారు. చరిత్ర రచనతో పాటు జేఎన్‌యూతో సహా వివిధ విశ్వవిద్యాలయాల్లో చరిత్ర సబ్జెక్ట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయడంతో పాటు సెంటర్‌ ఫర్‌ హిస్టోరికల్‌ సడ్డీస్‌ అధిపతిగానూ, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెన్స్‌ డీన్‌గాను పనిక్కర్‌ బాధ్యతలు నిర్వహించారు. చరిత్ర బోధనతో పాటు, ముఖ్యమైన విద్య, సంస్థాగత పాత్రలను కూడా ఫణిక్కర్‌ సమర్థవంతగా పోషించారు. శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం వైఎస్‌ ఛాన్సలర్‌గానూ, కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మెన్‌గా పనిచేశారు. కెసిహెచ్‌ఆర్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

అలాగే, దేశంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ చరిత్రకారుల సంస్థ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా 2008లో ఎన్నికయ్యారు. ఫణిక్కర్‌ కేరళ హిస్టరీ కాంగ్రెస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. 1972లో జేఎన్‌యూలో చేరడానికి ముందు రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి సంస్థల్లో పనిచేశారు.

ఫణిక్కర్‌ మృతి విద్యా ప్రపంచానికి, వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమానికి లోటు : ఎంఎ బేబీ
కె.ఎన్‌. ఫణిక్కర్‌్‌ మృతిపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తీవ్ర విచారర వ్యక్తం చేశారు. ఫణిక్కర్‌్‌ మృతి దేశంలో విద్యా ప్రపంచానికి, వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమానికి తీవ్రమైన లోటు అని బేబీ పేర్కొన్నారు. లౌకికవాదానికి ఫణిక్కర్‌ బలమైన రక్షకుడని, ప్రగతిశీ మేధావులకు మార్గదర్శకుడని బేబీ కొనియాడారు. చరిత్రను మతతత్వం చేయడానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన విమర్శనాత్మక ఆలోచనా యోధుడిగా ఫణిక్కర్‌ను బేబీ అభివర్ణించారు. 2006-11లో కేరళలో అప్పటి విఎస్‌ అచ్యుతానందన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసే బాధ్యతను ఫణిక్కర్‌కు అప్పగించిన విషయాన్ని బేబీ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టం ద్వారా దేశంలోనే తొలిసారిగా కేరళలో ఇది ఏర్పాటయిందని, ఫణిక్కర్‌ సృజనాత్మక కృషితో అనేక సంస్కరణలు, కొత్త చొరవలు ఇక్కడ ప్రవేశపెట్టారని బేబీ తెలిపారు. ఢిల్లీలోని జెఎన్‌యులో పనిచేసిన సమయంలోనే జనసంస్కృతి, స్వరలయ అనే రెండు సాంస్కృతిక సంస్థల్లో ఫణిక్కర్‌్‌ చాలా చురుగ్గా పని చేశారని బేబీ హృదయపూర్వకంగా గుర్తుచేసుకున్నారు. ఫణిక్కర్‌ కృషి, లౌకిక, ప్రగతిశీల విలువల పట్ల ఫణిక్కర్‌ నిబద్ధత మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని బేబీ ఈ సందర్భంగా తెలిపారు. ఫణిక్కర్‌ కుటుంబానికి, స్నేహితులకు, విద్యార్థులకు బేబీ హృదయపూర్వక సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -