కానిస్టేబుల్ను హత్యచేసిన నిందితుడు హతం
ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఫైర్ చేసే యత్నం
ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు చేసినట్టు సీపీ ప్రకటన
తెల్లవారుజామునే నిందితుని అంత్యక్రియలు పూర్తి
ఎన్కౌంటర్పై మానహహక్కుల కమిషన్ నోటీసులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/కంఠేశ్వర్
నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు.. సోమవారం ఉదయం ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఫైర్ చేసేందుకు యత్నించగా.. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపడంతో రియాజ్ మృతిచెందాడు. ఈ ఘటనపై సీపీ సాయిచైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆసిఫ్ అనే వ్యక్తి నిందితుడు రియాజ్ను పట్టించాడు. ఈ సమయంలో ఇద్దరూ గాయపడటంతో.. ఆసిఫ్ను హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. రియాజ్ను నిజామాబాద్ జీజీహెచ్లో ఖైదీ వార్డుకు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ఆస్పత్రి అద్దాలను ధ్వంసం చేశాడు. రెగ్యూలర్ తనిఖీలలో భాగంగా అటుగా వచ్చిన ఏఆర్ పోలీసులు అతన్ని వారించారు. అదే సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్నాడు. దాన్ని ఇవ్వాలని చెబుతున్నా వినకుండా ట్రిగ్గర్ నొక్కి కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణలో భాగంగా ఏఆర్ ఎస్ఐ కాల్పులు జరిపారు. దాంతో కింద పడిపోయిన రియాజ్ లేవకపోవడంతో వైద్యులు పరిశీలించి మృతిచెందినట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించి కేసు విచారణలో ఉంది.
తెల్లవారుజామున రియాజ్ అంత్యక్రియలు
రియాజ్ మృతదేహానికి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. మంగళవారం తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
నిందితుడికి సరైన శిక్ష : కానిస్టేబుల్ భార్య ప్రణీత
నిందితుడి ఎన్కౌంటర్పై.. సీసీఎస్ కానిస్టేబుల్ భార్య ప్రణీత పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్త హత్య జరిగిన రోజు.. అర్జెంట్గా రావాలని సీసీఎస్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆయన డ్యూటీకి వెళ్లాడని.. తిరిగి మృతదేహంగా ఇంటికి వచ్చాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. నిజామాబాద్లోని రౌడీ షీటర్లందరినీ ఏరిపారేయాలని కోరారు. తనలాంటి పరిస్థితి మరో కుటుంబానికి రావద్దన్నారు. కానిస్టేబుల్కు భార్య, ముగ్గురు కుమా రులున్నారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతిచెందడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఆస్పత్రి ఎదుట, పోలీస్ కమిషనరేట్ ఎదుట పటాకులు కాల్చి నిందితుడికి సరైన శిక్ష పడినట్టు హర్షం వ్యక్తం చేశారు.
రియాజ్ ఎన్కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES