నవతెలంగాణ-సదాశివపేట
సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు Arrive and Alive కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో సదాశివపేట ఎమ్మార్వో, ఆర్టీసీ కంట్రోలర్, సదాశివపేట మున్సిపల్ కమిషనర్, కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొనగా, సుమారు 150 మంది గ్రామస్తులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామస్తులకు క్రింది రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.మద్యం సేవించి వాహనం నడపకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్ రూట్లో వెళ్లకూడదని, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని సూచించారు. అలాగే రోడ్డుపై స్టంట్లు చేయకూడదని, అతివేగంగా వాహనం నడపరాదని, లైన్ క్రాసింగ్ చేయకూడదని తెలిపారు. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనాలకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు నడపడానికి అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తుల్లో రహదారి భద్రతపై మంచి అవగాహన ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు.


