2వేల కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఎగబడి పట్టుకెళ్లిన జనం
ఎలాంటి వ్యాధీ లేదని నిర్ధారించిన పశువైద్యాధికారి
నవతెలంగాణ-నయీంనగర్
హనుమకొండ జిల్లా శివారులోని వరంగల్-సిద్ధిపేట జాతీయ రహదారిలోని ఎల్కతుర్తి మండల మోడల్ స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2వేల నాటుకోళ్లను వదిలేశారు. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో వరి, పత్తి చేలల్లో నాటు కోళ్లు కనపడటంతో ఎల్కతుర్తి, చింతలపల్లి, ఇందిరానగర్ గ్రామ ప్రజలు దొరికిన కాడికి పట్టుకెళ్లారు. ఒక్కొక్కరు రెండు
నుంచి 8 వరకు కూడా పట్టుకున్నారు. విషయం తెలిసిన ఎస్ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్.. వెటర్నరీ డాక్టర్ దీపికకు మూడు కోళ్లను అప్పగించారు. ఆ కోళ్లను తాము చెప్పే వరకు ప్రజలు ఎవరూ తినొద్దని పశువైద్యాధికారి డాక్టర్ దీపిక చెప్పారు.
వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయంపై కొన్ని కోళ్లను ల్యాబ్కు పంపించామని, ప్రజలు తమ ఆరోగ్య రీత్యా వాటిని తినకుండా ఉండాలని చెప్పారు. వాటిని పోలీస్ల ఆధ్వర్యంలో వరంగల్ ల్యాబ్ తీసుకువెళ్లి పరీక్షించారు. అనంతరం నాటు కోళ్లకు ఎలాంటి రోగమూ లేదని ప్రకటించారు. దాంతో అందరి ఇండ్లల్లోనూ నాటి కోడి కూర పండుగ చేసుకున్నారు. సుమారు 2వేల కోళ్లను ఎవరు వదిలేశారు ? ఎందుకు వదిలివేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. పోలీసులు తమ వంతుగా దర్యాప్తు చేపట్టారు.



