Sunday, June 1, 2025
E-PAPER
Homeఆటలుసెమీస్‌లో సాచి

సెమీస్‌లో సాచి

- Advertisement -

వరల్డ్‌ నం.1 షట్లర్లపై అదిరే విజయం
సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750

సింగపూర్‌ : భారత బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ స్టార్స్‌ వరుస టోర్నమెంట్లలో నిరాశపరుస్తుండగా.. డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి (సాచి జోడీ) విరామం తీసుకున్నా అదిరే ప్రదర్శన చేస్తున్నారు. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయం సాధించిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వరల్డ్‌ నం.1, రెండో సీడ్‌ ఫెరు, నుర్‌ ఇజుద్దీన్‌లపై వరుస గేముల్లో సూపర్‌ విక్టరీ సాధించారు. శుక్రవారం సింగపూర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 21-17, 21-15తో సాచి జోడీ మలేషియా స్టార్స్‌ను చిత్తు చేశారు. నేడు సెమీఫైనల్లో వరల్డ్‌ నం.3, మూడో సీడ్‌ అరోన్‌ చియా, ఊల్‌ వుక్‌ (మలేషియాలతో సాత్విక్‌, చిరాగ్‌ తలపడనున్నారు.
అదరగొట్టారు
విరామం తర్వాత బరిలోకి దిగినా.. సాత్విక్‌, చిరాగ్‌లు అదరగొట్టారు. వరల్డ్‌ నం.1 జోడీని 39 నిమిషాల్లోనే మట్టికరిపించారు. తొలి గేమ్‌ నువ్వా నేనా అన్నట్టు మొదలైనా.. విరామ సమయానికి సాత్విక్‌, చిరాగ్‌లు ముందంజ వేశారు. 7-7తో స్కోరు సమం కాగా.. 11-8తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించారు. విరామం తర్వాత మలేషియా షట్లర్లకు సాచి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. 16-15తో పాయింట్ల అంతరం తగ్గించే ప్రయత్నం చేసినా.. సాచి జోడీ వెనక్కి తగ్గలేదు. వరుస పాయింట్లతో 21-17తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. కీలక రెండో గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు దుమ్మురేపారు. 6-6తో అటు ఇటుగా సాగిన మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. 11-7తో విరామ సమయానికి ఆధిక్యం సాధించిన సాత్విక్‌, చిరాగ్‌లు.. ద్వితీయార్థంలోనూ అదే దూకుడు కొనసాగించారు. 18-11తో గెలుపు లాంఛనం చేసుకున్న సాచి.. ఆఖర్లో కాస్త తగ్గినా 21-15తో రెండో గేమ్‌తో పాటు సెమీఫైనల్‌ బెర్త్‌ సొంతం చేసుకుంది. ఫిట్‌నెస్‌ సమస్యలతో వరుసగా టోర్నమెంట్లకు దూరమై ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి పడిపోయిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ క్వార్టర్స్‌లో వరల్డ్‌ నం.1ను ఓడించి విలువైన ఆత్మవిశ్వాసం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -